కాన్పూర్ ఎన్‌కౌంటర్‌: పోస్టుమార్టంలో మరో దారుణం వెలుగులోకి..

ABN , First Publish Date - 2020-07-06T01:19:42+05:30 IST

కాన్పూరు ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరో దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే గ్యాంగ్

కాన్పూర్ ఎన్‌కౌంటర్‌: పోస్టుమార్టంలో మరో దారుణం వెలుగులోకి..

లక్నో: కాన్పూరు ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరో దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసుల శవపరీక్ష నివేదిక బయటకు రాగా, విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆ నివేదిక ప్రకారం.. బిల్హౌర్ సర్కిల్ ఆఫీసర్ (సీవో) దేవేంద్ర మిశ్రా తలను వికాస్ దూబే మనుషులు గొడ్డలితో నరికారు. అతడి కాలివేళ్లను తెగ్గోశారు. అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశారు. మరో ఎస్సై శరీరాన్ని బుల్లెట్లతో జల్లెడ చేశారు. ఓ కానిస్టేబుల్ ‌శరీరంపై గుళ్ల వర్షం కురిపించారు. ఇవన్నీ ఏకే-47తో చేసినట్టు అనుమానిస్తున్నారు. 


ఎన్‌కౌంటర్ తర్వాత వికాస్ దూబే మనుషులు పోలీసు పార్టీ నుంచి తుపాకులు లాక్కుని వాటితోనే 8 మంది పోలీసులను కాల్చి చంపినట్టు సమాచారం. కానిస్టేబుళ్లు బబ్లు, రాహుల్, సుల్తాన్‌లను .315 బోర్ వెపన్‌తో కాల్చి చంపినట్టు డాక్టర్ల అటాప్సీ నివేదికలో వెల్లడైంది. కానిస్టేబుళ్లు జితేంద్ర పాల్‌పై ఏకే-47తో కాల్పులు జరిపారు. గాయాలన్నీ తల, భుజాలపైనే ఉండడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి దాడిని మావోయిస్టులు మాత్రమే చేస్తారని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. కాగా, పోలీసుల దాడి గురించి వికాస్ దూబేకు ముందే తెలిసిందని పోలీసుల అదుపులో ఉన్న వికాస్ దూబే అనుచరుడు దయా శంకర్ అగ్నిహోత్రి చెప్పడం కలకలం రేపింది. 

Updated Date - 2020-07-06T01:19:42+05:30 IST