రాజధాని విషయంలో సీఎం జగన్ వైఖరిని తప్పుబట్టిన సుంకర

ABN , First Publish Date - 2021-10-18T17:39:54+05:30 IST

అమరావతి రాజధాని విషయంలో సీఎం జగన్ వైఖరిని అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ తప్పుబట్టారు.

రాజధాని విషయంలో సీఎం జగన్ వైఖరిని తప్పుబట్టిన సుంకర

విజయవాడ:  అమరావతి రాజధాని విషయంలో సీఎం జగన్ వైఖరిని అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ తప్పుబట్టారు. రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ వైఖరి ఏరుదాటే వరకు ఓడ మల్లన్న ఏరు దాటిన తరువాత బోడి మల్లన్నలా ఉందని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణంపై గత ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని గగ్గోలు పెట్టిన ముఖ్యమంత్రి నేడు అదే అమరావతి రైతులను రోడ్డుమీదకు లాగేశారన్నారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని అసెంబ్లీ సాక్షి చెప్పిన మాటలు ముఖ్యమంత్రి మర్చిపోయారా అని ప్రశ్నించారు. తాను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని, ఇక్కడే పార్టీ ఆఫీసు పెట్టానని, ఇక్కడే ఉంటాను అన్నారు కదా...తాను మాట ఇస్తే అమలు చేయడమే గానీ మడమ తిప్పేది లేదని అంటారు మరి రాజధాని విషయంలో మీరు చేసింది ఏంటి అని నిలదీశారు.


వ్యవసాయం తప్ప మరొకటి తెలియని అమాయక రైతులు రాజధాని కోసం భూములు ఇస్తే వారిని మోసం చేయడం దారుణమన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతులను అవహేళన చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతులపై దాడులు చేయడం, వారిపై అక్రమ కేసులు పెట్టడం పిరికిపంద చర్య అని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఎటువంటి అవకతవకలు జరగలేదని న్యాయస్థానం చెప్పినా ముఖ్యమంత్రిలో మార్పు రావడం లేదన్నారు. రైతులకు సమాధానం చెప్పే దమ్ము లేక ఫేక్ నేతలతో రైతులను తిట్టిస్తున్నారని అన్నారు. రాజధానికి కులం, మతం రంగుపూసి నాశనం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం  వ్యక్తం చేశారు. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వికృత చేష్టలను కేంద్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే బీజేపీ, వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సుంకర పద్మశ్రీ హెచ్చరించారు. 

Updated Date - 2021-10-18T17:39:54+05:30 IST