ప్రభుత్వం చేయాల్సిన పని గవర్నర్ చేయాల్సిరావడం దురదృష్టకరం: Vijayashanti
ABN , First Publish Date - 2022-06-12T01:03:02+05:30 IST
Telangana: ప్రభుత్వం చేయాల్సిన పని గవర్నర్ చేయాల్సిరావడం నిజంగా దురదృష్టకరమని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. ఇటీవల గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో
Hyderabad: ప్రభుత్వం చేయాల్సిన పని గవర్నర్ చేయాల్సిరావడం నిజంగా దురదృష్టకరమని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. ఇటీవల గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో మహిళా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంపై విజయశాంతి తన ఫేస్ బుక్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు.
‘‘గవర్నర్ తమిళిసై నిర్వహించిన మహిళా దర్బార్కు భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 500 మందికిపైగా మహిళలు, వృద్ధులు, వివిధ ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు వచ్చి వినతిపత్రాలు అందజేశారు. మహిళా దర్బార్ ఏర్పాటు చేయడంపై గవర్నర్కు నా ధన్యవాదాలు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ మహిళలకు సోదరిగా సేవ చేస్తున్నారు. సమస్యలతో వచ్చిన మహిళలను స్టేజ్ మీదకు పిలిపించుకొని మాట్లాడారు. అండగా ఉంటానని భరోసా ఇవ్వడం అభినందనీయం.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వరకట్న వేధింపులు, టీఆర్ఎస్ నేతలు, ఇతరుల భూకబ్జాలు, 317 జీవో, ఉద్యోగుల బదిలీ వంటి పలు సమస్యలు గవర్నర్ దృష్టికి వచ్చాయి. పలు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన విరాళాలు రూ.2 కోట్లు ఉన్నాయని, వాటి నుంచి ఆర్థిక సాయం చేస్తామని బాధితులకు గవర్నర్ భరోసా ఇవ్వడం హర్షనీయం.
టీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని ఈ ఫిర్యాదుల ద్వారా తెలుస్తోంది. ఒక్క గవర్నర్ ఎంతో చేస్తుంటే.. ఇంతమంది మంత్రులు ఉన్న కేసీఆర్ సర్కార్ ఏం చేస్తోంది? కేసీఆర్... ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ప్రజా సమస్యలను పట్టించుకో.. రానున్న రోజుల్లో ఈ టీఆర్ఎస్ సర్కార్కు తెలంగాణ ప్రజలే కర్ర కాల్చి వాత పెడతారు.’’ అని విజయశాంతి పేర్కొన్నారు.