మీడియాపై ఆంక్షలా?: Vijayashanti
ABN , First Publish Date - 2022-05-31T02:34:30+05:30 IST
Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రోజురోజుకూ మీడియాపై ఆంక్షలు పెరిగిపోతున్నాయని బీజేపీ నేత విజయశాంతి పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా
Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రోజురోజుకూ మీడియాపై ఆంక్షలు పెరిగిపోతున్నాయని బీజేపీ నేత విజయశాంతి పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేశారని అప్పట్లో రెండు టీవీ చానళ్ల ప్రసారాలను ఆపించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఇంతేనని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారని, ఈ సంస్కృతి ఇటీవల జిల్లాలకు కూడా వ్యాపించిడం దురదృష్టకరమన్నారు.
ఇంకా ఏమన్నారంటే...
‘‘వరంగల్ జిల్లాలో నిన్న మొన్నటి వరకు కార్పొరేట్, కౌన్సిల్ మీటింగులకు జర్నలిస్టులను అనుమతించని ఆఫీసర్లు..ఇప్పుడు కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాల్లో జరిగే గ్రీవెన్స్ సెల్కు రావద్దంటున్నారు. రివ్యూ మీటింగులకు, జడ్పీ సమావేశాలకు కూడా అనుమతించడం లేదు. గ్రీవెన్స్లు, మీటింగులు ముగిశాక ఆఫీసర్లే పేపర్లలో రాసుకునేందుకు ప్రెస్నోట్లు, ఛానళ్లలో చూపించేందుకు విజువల్స్ ఇస్తున్నారు. లోపల జరిగింది జరిగినట్లు కాకుండా సమస్యలు దాచి, సర్కారుకు అనుకూలంగా ఉండే సమాచారం మాత్రమే ఇస్తున్నారు. అధికారుల దృష్టికి జనం తెస్తున్న సమస్యలు, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలు బయటకు రావడం లేదు. ప్రజాధనంతో నడుపుతున్న కార్యక్రమాలు, సమావేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ సమస్యలను అసలు ప్రస్తావిస్తున్నారో.. లేదో జనం తెలుసుకోవాలనుకుంటారు. సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, గ్రీవెన్స్ సెల్లలో అధికారుల దృష్టికి ప్రజలు తెచ్చే సమస్యలను ఆధారం చేసుకొని.. జర్నలిస్టులు వాటి వెనుక అసలు కారణాలతో ప్రత్యేక కథనాల రూపంలో బయటపెడతారు. తద్వారా సమస్యలు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ తన డొల్లతనం ఎక్కడ బయట పడుతుందోనని.. మీడియాపై ఆంక్షలు పెట్టి సర్కార్ను నెట్టుకొస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇలా ఎంత కాలం నడిపిస్తావు? నువ్వు ఎంత ఆపినా నీ అక్రమాలు, నిరంకుశ పాలన గురించి తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. వారే నీ కారును, నీ సర్కార్ను భూస్థాపితం చేస్తారు’’ అని తన ఫేస్బుక్లో పేర్కొన్నారు.