మేం బాధితులం..అయినా సాయపడుతున్నాం: ఉక్రెయిన్
ABN , First Publish Date - 2022-02-28T22:17:20+05:30 IST
రష్యా దురాక్రమణదారుల బాధితులం తామని, అయినప్పటికీ ఇతరులకు సాయపడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని...
న్యూఢిల్లీ: రష్యా దురాక్రమణదారుల బాధితులం తామని, అయినప్పటికీ ఇతరులకు సాయపడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఇండియాలో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఐగోర్ పోలిఖా అన్నారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులు సహా, ఇతర దేశస్థులను సురక్షితంగా దేశం విడిచిపెట్టేందుకు అవసరమైన సాయం చేస్తున్నామని చెప్పారు. భారతీయ స్టూడెంట్ల విషయంలో పూచీ ఇవ్వాల్సింది పుతిన్ మాత్రమేనని అన్నారు. ''పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. మాకున్న వనరులు తక్కువ. మేము దురాక్రమణదారుల బాధితులం. అయినప్పటికీ ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో సహా ప్రజలందరికి సాయ పడేందుకు మేము కృషి చేస్తున్నాం'' ఆయన తెలిపారు.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకు రావడం భారత్ ప్రియారిటీ అని, యుద్ధాన్ని ఆపడం, రష్యాపై ఒత్తిడి తీసుకురావడం ఉక్రెయిన్ తక్షణ ప్రాధాన్యతాంశమని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు. ఇండియన్ అఫీషియల్స్తో తాను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నానని, రెండు దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ శరణార్ధులు 4 లక్షల మందికి పైనే ఉన్నట్టు తెలిపారు. యుద్ధం ఆగనట్లయితే ఆ సంఖ్య 70 లక్షలకు చేరవచ్చని చెప్పారు. సరిహద్దుల్లో పొడవైన క్యూలు ఉన్నాయని, లక్షలాది మంది ఉక్రేయిన్ ప్రజలు సరిహద్దులు దాటేందుకు క్యూలలో పడిగాపులు పడుతున్నారని అన్నారు.