ఏ క్షణమైనా కోవిడ్ ముప్పు: వెంకయ్య నాయుడు

ABN , First Publish Date - 2021-08-30T23:27:45+05:30 IST

ఏ క్షణమైనా కోవిడ్ ముప్పు: వెంకయ్య నాయుడు

ఏ క్షణమైనా కోవిడ్ ముప్పు: వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో డి.ఆర్.డి.ఓ.కు చెందిన డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ, అలైడ్ సైన్సెస్ (డి.ఐ.పి.ఏ.ఎస్)కు చెందిన శాస్త్రవేత్తలు, ముందు వరుస యోధుల సహకారం అభినందనీయమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. భవిష్యత్తులో ఎదురు కాబోయే మరిన్ని మహమ్మారులను ఎదుర్కొనే దిశగా వారి పరిశోధనలను మరింత సమర్థవంతంగా ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. 


డి.ఐ.పి.ఏ.ఎస్.కు చెందిన దాదాపు 25 మంది శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులను సోమవారం ఉపరాష్ట్రపతి తమ నివాసానికి ఆహ్వానించారు. వారిలో డి.ఆర్.డి.ఓ. చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి ఉన్నారు. కోవిడ్ -19 చికిత్స, నిర్వహణ కోసం వివిధ స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేసిన డి.ఐ.పి.ఏ.ఎస్, ఇతర డి.ఆర్.డి.ఓ. ల్యాబ్‌లను ఉపరాష్ట్రపతి అభినందించారు. 


ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన ఉపరాష్ట్రపతి.. కరోనా మహమ్మారి కారణంగా గతంలో ఎన్నడూ చూడని ఆరోగ్య సంక్షోభం ఎదురైందన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది జీవితాలు, వారి జీవనోపాధులు ప్రతికూలంగా ప్రభావితం అయ్యాయన్నారు. సార్స్ కోవ్ -2 నేపథ్యంలో ఈ మహమ్మారులు ఏ క్షణమైనా ముప్పిరిగొనే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సమాజం సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 


ఈ కార్యక్రమం ప్రారంభంలో కోవిడ్ -19 చికిత్స, నిర్వహణ కోసం డి.ఆర్.డి.ఓ. ల్యాబ్స్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చెందిన వివిధ ఉత్పత్తులు, పరికరాల గురించి డాక్టర్ జి. సతీష్ రెడ్డి, ఉపరాష్ట్రపతికి వివరించారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆహ్వానించి తమ అభిప్రాయాలు, ఆలోచనలను వారితో పంచుకున్నందుకు ఉపరాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో డి.ఐ.పి.ఏ.ఎస్. సంచాలకులు డాక్టర్ రాజీవ్ వర్షిణి కూడా ఉన్నారు


Updated Date - 2021-08-30T23:27:45+05:30 IST