శాంతియుత జీవనంతోనే అభివృద్ధి: వెంకయ్య

ABN , First Publish Date - 2020-02-22T08:58:24+05:30 IST

నేటి సమాజంలో అవినీతి, అశాంతి, కులవివక్ష, నిరక్షరాస్యత, పేదరికం పెనుసవాళ్లుగా మారాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

శాంతియుత జీవనంతోనే అభివృద్ధి: వెంకయ్య

చెన్నై, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): నేటి సమాజంలో అవినీతి, అశాంతి, కులవివక్ష, నిరక్షరాస్యత, పేదరికం పెనుసవాళ్లుగా మారాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వీటిపై పోరాటం చేయడం ద్వారా నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తమిళనాట కోయంబత్తూరులోని ప్రసిద్ధ ఈషా యోగా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వేడుకల్లో భాగంగా సద్గురు జగ్గీ వాసుదేవ్‌ రాసిన ‘డెత్‌- యాన్‌ ఇన్‌సైడ్‌ స్టోరీ’ పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. అంతకుముందు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలుకుతూ ఈషా సంస్కృతి చిన్నారులు ఆదిశంకరాచార్య రాసిన నిర్వాణ శతకాన్ని పారాయణం చేశారు. అనంతరం ధ్యానలింగం వద్ద వెంకయ్య పంచభూత ఆరాధన జరిపారు. లింగ భైరవి, ధ్యానలింగ యోగా ఆలయాన్ని సందర్శించి, ఆదియోగి విగ్రహం వద్దకు చేరుకుని జ్యోతిని వెలిగించారు.  

Updated Date - 2020-02-22T08:58:24+05:30 IST