Jamia Masjid ముందు హనుమాన్ చాలీసా పఠిస్తాం...వీహెచ్పి బెదిరింపు
ABN , First Publish Date - 2022-06-04T17:31:46+05:30 IST
కర్ణాటక రాష్ట్రం మాండ్యా పట్టణంలోని జామియా మసీదు వెలుపల హనుమాన్ చాలీసా పఠిస్తానని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) భజరంగ్దళ్కు చెందిన కార్యకర్తలు హెచ్చరించారు....
మాండ్యా(కర్ణాటక): కర్ణాటక రాష్ట్రం మాండ్యా పట్టణంలోని జామియా మసీదు వెలుపల హనుమాన్ చాలీసా పఠిస్తానని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) భజరంగ్దళ్కు చెందిన కార్యకర్తలు హెచ్చరించారు. శనివారం మసీదు వెలుపల హనుమాన్ చాలీసాను పఠించి నిరసన తెలిపే ఉద్దేశాన్ని వ్యక్తం చేయడంతో కర్ణాటక పోలీసులు భద్రతను పెంచారు.వివాదాస్పద మసీదుకు ఒక కిలోమీటర పరిధిలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ),భజరంగ్ దళ్కు చెందిన కార్యకర్తలు తెలిపారు. ఆందోళనకారులను అక్కడికక్కడే అరెస్టు చేసేందుకు పోలీసులు మోహరించారు.మాండ్యలోని శ్రీరంగపట్నం తాలూకాలోని జామియా మసీదు వెలుపల పోలీసులు శనివారం బారికేడ్లు ఏర్పాటు చేశారు.
శాంతిభద్రతలను కాపాడేందుకు ఐదు కర్నాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ ప్లాటూన్లు, ఇతర భద్రతా బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు.అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.మాండ్యాలో సెక్షన్ 144 విధించారు. ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించరాదని పోలీసులు ఆదేశించారు జూన్ 3 మధ్యాహ్నం 3 గంటల నుంచి జూన్ 5 మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీసులు చెప్పారు.