ముగిసిన వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2022-05-24T05:04:51+05:30 IST
వర్గల్ వేణుగోపాలస్వామి ఆలయంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి.
ఘనంగా స్వామివారికి చక్రతీర్థం, వసంతోత్సవం, శ్రీపుష్పయాగం
భక్తిపారవశ్యమైన ఆలయ ప్రాంగణం
వర్గల్, మే 23: వర్గల్ వేణుగోపాలస్వామి ఆలయంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఆలయ వేదపండితులు వేదాంతం మురళీధరచార్యుల నేతృత్వంలో ఉదయం రుక్మిణీ, సత్యభామ సహిత వేణుగోపాలస్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించి ఆలయ పుష్కరిణీలో చక్రస్నానం, చక్రతీర్థం నిర్వహించారు. భక్తులు ఆలయ పుష్కరిణీలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా స్వామివారికి శ్రీపుష్పయాగం చేశారు. ఆలయ నిర్వాహకులు టేకులపల్లి రాంరెడ్డి, పొద్దటూరు రాజులుగుప్తా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా, తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యమైనాయి.