ఎమ్మెల్సీ పదవులకు వంశీకృష్ణ, కళ్యాణి నామినేషన్‌

ABN , First Publish Date - 2021-11-21T06:09:54+05:30 IST

స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ తరపున వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కళ్యాణి శనివారం నామినేషన్లు దాఖలు చేశారు.

ఎమ్మెల్సీ పదవులకు వంశీకృష్ణ, కళ్యాణి నామినేషన్‌

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ తరపున వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కళ్యాణి శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌-1 ఎం.వేణుగోపాల్‌రెడ్డికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం నిజాయితీగా కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు వుంటుందనడానికి ఎమ్మెల్సీ పదవుల కేటాయింపే నిదర్శనమన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పెద్దల సభకు పెద్దవారినే పంపిస్తారనే అభిప్రాయాన్ని తొలగించేలా ఎమ్మెల్సీ పదవులకు వంశీకృష్ణ, కళ్యాణిలను సీఎం ఎంపిక చేశారన్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. అంతకుముందు శివాజీపాలెంలోని వంశీకృష్ణ శ్రీనివాస్‌ నివాసం నుంచి ర్యాలీగా ఇద్దరు అభ్యర్థులు పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ విజయసాయిరెడ్డి, ముత్తంశెట్టిలతో కలిసి దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. 

Updated Date - 2021-11-21T06:09:54+05:30 IST