చార్ధామ్ యాత్రపై నిషేధం ఎత్తివేత
ABN , First Publish Date - 2021-09-16T20:45:00+05:30 IST
చార్ధామ్ యాత్రపై విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు
డెహ్రాడూన్ : చార్ధామ్ యాత్రపై విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఉపసంహరించింది. కేదార్నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను సందర్శించే భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 నెగెటివ్ రిపోర్టు, సంపూర్ణ టీకాకరణ ధ్రువపత్రం తమ వెంట తీసుకురావాలని తెలిపింది. కేదార్నాథ్ దేవాలయానికి 800 మంది, బదరీనాథ్ దేవాలయానికి 1,200 మంది, గంగోత్రికి 600 మంది, యమునోత్రికి 400 మంది భక్తులను అనుమతించింది.
అంతకుముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన వివరాల్లో రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడిందని తెలిపింది. చార్ధామ్ యాత్ర మార్గంలో నివసించే ప్రజలు అక్కడికి వచ్చే భక్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపింది. యాత్రను అనుమతించాలని కోరింది.
జూలై ఒకటి నుంచి స్థానిక భక్తులను చార్ధామ్ యాత్రకు అనుమతించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై హైకోర్టు స్టే విధించింది. దీనిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
అధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉత్తరాఖండ్లో 296 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.