ఉత్తరాఖండ్‌, యూపీ, గోవాల్లో.. కాషాయ దళానిదే హవా

ABN , First Publish Date - 2022-01-11T09:56:23+05:30 IST

వచ్చే నెల నుంచి జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందని టైమ్స్‌నౌ ఒపీనియన్‌ పోల్‌ అంచనా వేసింది. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, గోవాల్లో కాషాయ దళం మరోమారు అధికారాన్ని చేపడుతుందని స్పష్టం చేసింది. పంజాబ్‌లో..

ఉత్తరాఖండ్‌, యూపీ, గోవాల్లో..  కాషాయ దళానిదే హవా

కాంగ్రెస్‌కు అన్నిచోట్లా రిక్త‘హస్తమే’.. పంజాబ్‌ గడ్డపై ఆప్‌ ‘భల్లేభల్లే’

  టైమ్స్‌నౌ ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడి


న్యూఢిల్లీ, జనవరి 10: వచ్చే నెల నుంచి జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందని టైమ్స్‌నౌ ఒపీనియన్‌ పోల్‌ అంచనా వేసింది. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, గోవాల్లో కాషాయ దళం మరోమారు అధికారాన్ని చేపడుతుందని స్పష్టం చేసింది. పంజాబ్‌లో మాత్రం మెజారిటీ నియోజకవర్గాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ‘చీపురు’తో ఊడ్చేస్తుందని వెల్లడించింది. ఒక్క పంజాబ్‌ మినహా.. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రె్‌సకు రిక్త‘హస్తం’ తప్పదని తెలిపింది. ఎవరు సీఎంలుగా ఉంటే బాగుంటుంది? అనే ప్రశ్నకు ఒపీనియన్‌ పోల్‌లో పాల్గొన్న వారు బీజేపీ పాలిత ప్రాంతాల్లో సిటింగ్‌లకు.. పంజాబ్‌లో ఆప్‌ నేత భగ్వంత్‌ మాన్‌కు జై కొట్టారని పేర్కొంది. మణిపూర్‌ మినహా.. మిగతా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి వెల్లడైన ఒపీనియన్‌ పోల్‌ ఫలితాలు ఇలా ఉన్నాయి..


యూపీలో బీజేపీ క్లీన్‌ స్వీప్‌

ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపీదే అధికారమని ఒపీనియన్‌ పోల్‌ ఉద్ఘాటించింది. 403 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ మేజిక్‌ ఫిగర్‌ను దాటి 227-254 సీట్లు సాధిస్తుందని పేర్కొంది. సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలకు 136-151 స్థానాలు, బీఎస్పీకి 8-14, కాంగ్రె్‌సకు 6-11 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ ఒపీనియన్‌ పోల్‌లో పాల్గొన్న వారిలో సింహభాగం ప్రజలు సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌కే జైకొట్టారని వివరించింది. ఈ రాష్ట్రంలో బీఎస్పీ, కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమా? అనే ప్రశ్నకు 42.27ు మంది అవునని, 46.32ు మంది కాదని సమాధానమిచ్చారు. యూపీలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా సమాజ్‌వాదీ వైపు మొగ్గుచూపుతున్నారని ఒపీనియన్‌ పోల్‌ స్పష్టం చేసింది. 


ఉత్తరాఖండ్‌లోనూ కాషాయ దళమే

ఉత్తరాఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని పుష్కర్‌సింగ్‌ ధామీ సర్కారుకే ప్రజలు జైకొడుతున్నారని టైమ్స్‌నౌ ఒపీనియన్‌ పోల్‌ వెల్లడించింది. ఆ పార్టీకి 44-50 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 12-15 సీట్లతో సరిపెట్టుకుంటుందని, అనూహ్యంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కు 5-8 సీట్లు వస్తాయని తెలిపింది.


గోవాలో వ్యతిరేకత ఉన్నా..

సముద్రతీర ప్రాంతం గోవాలో బీజేపీ సర్కారుపై వ్యతిరేకత ఉన్నా.. అవినీతి అంశంపై ప్రజలు విసిగిపోయినా.. తిరిగి ఆ పార్టీకే పట్టం కడతారని ఒపీనియన్‌ పోల్‌ అంచనా వేసింది. గోవా వాసులు ముఖ్యమంత్రిగా ప్రమోద్‌ సావంత్‌కే జైకొట్టారని తెలిపింది. ఇక్కడ బీజేపీకి 17-21 సీట్లు వస్తాయని.. అనూహ్యంగా ఆప్‌కు 8-11 సీట్లతో విపక్ష స్థానం దక్కే అవకాశం ఉందని వివరించింది. కాంగ్రెస్‌ 4-6 స్థానాలతో సరిపెట్టుకోనుందని వెల్లడించింది.


పంజాబ్‌లో ఆప్‌ పాగా..

ఢిల్లీలో పాలన కొనసాగిస్తున్న ఆప్‌కు పంజాబ్‌లో ఆదరణ భారీగా పెరిగింది. ఈ సారి ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టైమ్స్‌నౌ ఒపీనియన్‌ పోల్‌ స్పష్టం చేసింది. ఆ పార్టీకి 54-58 సీట్లు వచ్చే సూచనలు ఉన్నాయని.. కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికిని నిలుపుకొంటూ 41-47 స్థానాల్లో పాగా వేయనుందని తెలిపింది. ఇక శిరోమణి అకాలీదళ్‌కు 11-15 స్థానాలు, బీజేపీ-పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ కూటమికి 1-3 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పంజాబ్‌ సీఎంగా ఆప్‌ నేత భగ్వంత్‌ మాన్‌కు జైకొట్టారని వివరించింది. 

Updated Date - 2022-01-11T09:56:23+05:30 IST