నిరుపయోగంగా పోలీస్‌శాఖ స్థలాలు

ABN , First Publish Date - 2022-07-04T04:18:31+05:30 IST

నారాయణపేట జిల్లా కేంద్రం నడిబొడ్డున పోలీస్‌శాఖకు చెందిన రెండు వేర్వేరు చోట్ల ఉన్న స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయి.

నిరుపయోగంగా పోలీస్‌శాఖ స్థలాలు
పేట పత్తిబజార్‌లోని పోలీస్‌ క్వార్టర్స్‌ స్థలం

- బహిరంగ మార్కెట్‌లో ఈ స్థలాల విలువ రూ.కోటిపైగానే

- వినియోగంలోకి తీసుకరావాలంటున్న ప్రజలు

నారాయణపేట క్రైం, జూలై 3 : నారాయణపేట జిల్లా కేంద్రం నడిబొడ్డున పోలీస్‌శాఖకు చెందిన రెండు వేర్వేరు చోట్ల ఉన్న స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయి. సరాఫ్‌బజార్‌లో ప్రస్తుతం మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌గా ప్రాతి నిధ్యం వహిస్తున్న హరినారాయణ్‌ భట్టడ్‌ 17వ వార్డులో ఒకప్పుడు పోలీస్‌ స్టేషన్‌ ఉండేది. ఈ స్థలాన్ని గతంలో ఇక్కడ పని చేసిన పోలీస్‌ అధికారులు ఫెన్షింగ్‌ వేసి అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు చెట్లు నాటారు. దీనికి సమీపంలోనే 16వ వార్డు పరిధిలో పోలీస్‌ క్వార్టర్స్‌ పత్తిబజార్‌లో ఉండేది. ప్రస్తుతం పోలీస్‌ క్వార్టర్స్‌ శిథిలం కాగా పట్టణ ప్రగతిలో భాగంగా ఇటీవలే సుమారు 700 గజాల స్థలంలో పెరిగిన ముళ్లపొదలను, చెత్తాచెదా రాన్ని తొలగించి ఫెన్షింగ్‌ వేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో పోలీస్‌శాఖకు చెందిన స్థలాల విలువ సుమారు కోటి రూపాయల కుపై గానే ఉంటుంది. గతంలో రెవెన్యూ, పోలీస్‌ శాఖ అధికారులు ఈ స్థలం మాదంటే.. మాది అని కోల్డ్‌వార్‌ జరిగిన సంఘటన కూడా ఉంది. పోలీస్‌ స్టేషన్‌ ఉన్న స్థలాన్ని సరాఫ్‌బజార్‌కు చెందిన కొందరు వ్యాపారస్థులు వినియోగదారుల సౌకర్యార్థం పార్కింగ్‌, టాయిలెట్స్‌ ఏర్పాటుకు కేటాయించాలని విన్నవించగా అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. తాజాగా 16వ వార్డు కౌన్సిలర్‌ అంబికా గత నెల కలెక్టర్‌ హరిచందనను, ఎస్పీ వెంకటేశ్వర్లును కలిసి పోలీస్‌క్వార్టర్స్‌ స్థలాన్ని వినియోగంలోకి తీసుకవచ్చేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం కూడా అందజేశారు. 


Updated Date - 2022-07-04T04:18:31+05:30 IST