Nancy Pelosi: తైవాన్‌కు తూర్పున 4 యుద్ధనౌకలను మోహరించిన అమెరికా.. ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-08-03T01:29:36+05:30 IST

చైనా హెచ్చరికల మధ్య అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ(Nancy Pelosi) మంగళవారం తైవాన్ పయనమయ్యారు

Nancy Pelosi: తైవాన్‌కు తూర్పున 4 యుద్ధనౌకలను మోహరించిన అమెరికా.. ఉద్రిక్తత

వాషింగ్టన్: చైనా హెచ్చరికల మధ్య అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ(Nancy Pelosi) మంగళవారం తైవాన్ పయనమయ్యారు. అదే సమయంలో ఓ విమాన వాహకనౌక సహా అమెరికాకు చెందిన నాలుగు యుద్ధనౌకలు తైవాన్ తూర్పు జలాల్లో మోహరించడం ఉద్రిక్తతలకు కారణమైంది. యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్( USS Ronald Reagan) దక్షిణ చైనా సముద్రాన్ని (South China Sea) దాటుకుని ప్రస్తుతం ఫిలిప్పీన్స్ సముద్రంలో తైవాన్‌కు తూర్పున, ఫిలిప్పీన్స్, జపాన్‌కు దక్షిణంగా ఉన్నట్టు నేవీ అధికారిని ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ పేర్కొంది.


జపాన్‌కు చెందిన రీగన్ గైడెడ్ మిసైల్స్ ప్రయోగించే క్యారియర్. దీంతోపాటు యూఎస్ఎస్ అంటీనామ్, డిస్ట్రాయర్, యూఎస్ఎస్ హిగ్గిన్స్ ఉన్నాయి. అయితే,  ఇది రొటీన్ మోహరింపులో భాగమేనని ఆ అధికారి తెలిపారు. యూఎస్ నేవీ ఉభయచర యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీ(USS Tripoli) మోహరింపులో భాగంగా ఇదే ప్రాంతంలో ఉంది. పోర్ట్ ఆఫ్ శాండియాగో నుంచి అది మే నెల మొదట్లోనే బయలుదేరింది. 


చైనా అంటేనే విరుచుకుపడే పెలోసి మంగళవారం పొద్దుపోయాక తైపేయి చేరుకునే అవకాశం ఉంది. తైవాన్‌ను తమ భూభాగంలోనే భాగంగానే పరిగణిస్తున్న చైనా.. పెలోసీని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. పెలోసీ కనుక తైవాన్‌(Taiwan)లో అడుగుపెడితే అది రెచ్చగొట్టే చర్చే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, పెలోసీ కనుక తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పెలోసీ తైవాన్‌లో అడుగపెట్టనుండడం తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.    

Updated Date - 2022-08-03T01:29:36+05:30 IST