ఇది అన్యాయం.. భారత్‌పై విచారణ ప్రారంభించాం: అమెరికా

ABN , First Publish Date - 2020-06-03T18:01:21+05:30 IST

భారత్, బ్రిటన్, యూరప్‌లోని దేశాలు అమెరికా టెక్ కంపెనీలే టార్గెట్‌గా డిజిటల్ సేవల పన్నులను వడ్డిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు.

ఇది అన్యాయం.. భారత్‌పై విచారణ ప్రారంభించాం: అమెరికా

వాషింగ్టన్: భారత్, బ్రిటన్, యూరప్‌లోని దేశాలు అమెరికా టెక్ కంపెనీలే టార్గెట్‌గా డిజిటల్ సేవల పన్నులను వడ్డిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ విషయంపై విచారణ ప్రారంభిస్తున్నామని మంగళవారం నాడు ప్రకటించారు.


గత సంవత్సరం ఫ్రాన్స్‌పై అమెరికా ఇదే తరహా విచారణ చేపట్టింది. తాజాగా బ్రిటన్, ఐరోపా సమాఖ్య దేశాలతో పాటూ ఇండోనేషియా, టర్కీ, భారత్‌పై దృష్టి సారించింది. అన్యాయమైన విధానాల నుంచి అమెరికా కంపెనీలను రక్షించుకునేందుకు ఆయా దేశాల్లో పన్నులు విధిస్తున్న తీరుపై విచారణ చేపట్టింది.


‘అమెరికా వాణిజ్య భాగస్వాముల్లో కొందరు అన్యాయమైన పన్ను విధానాల ద్వారా అమెరికా కంపెనీలకు నష్టం కలిగిస్తున్నారంటూ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు’ అని అమెరికా ట్రేడ్ రిప్రసెంటెటేటివ్ రాబర్ట్ లైథైజర్ మంగళ వారం వ్యాఖ్యానించారు. ‘వివక్షపూరిత విధానాల నుంచి తమ సంస్థలను రక్షించుకునేందుకు అమెరికా అన్ని చర్యలూ తీసుకుంటుంది’ అని ఆయన స్పష్టం చేశారు.


ఆన్‌లైన్ అమ్మకాలు, అడ్వర్‌టైజ్‌మెంట్లు ద్వారా వచ్చే ఆదాయంపై పన్నులు విధించడాన్ని అమెరికా తొలి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. అమెరికా టెక్ దిగ్గజాలైన గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిని మాత్రమే టార్గెట్ చేసేలా పన్నుల రూపకల్పన జరిగిందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. 

Updated Date - 2020-06-03T18:01:21+05:30 IST