ముందస్తు కార్యాచరణతోనే పట్టణ ప్రగతి సాధ్యం: ప్రతిమా సింగ్
ABN , First Publish Date - 2022-05-22T05:06:58+05:30 IST
ముందస్తు కార్యాచరణతోనే పట్టణ ప్రగతి సాధ్యం అవుతుందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
మెదక్ మున్సిపాలిటీ/తూప్రాన్, మే 21: ముందస్తు కార్యాచరణతోనే పట్టణ ప్రగతి సాధ్యం అవుతుందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జూన్ 3వ తేదీ నుంచి చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంపై మెదక్, రామాయంపేట మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లతో కలిసి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల నివేదికలను తయారు చేసి జూన్ 2వ తేదీలోగా కలెక్టరేట్లో అందజేయాలన్నారు. అదే విధంగా తెలంగాణ క్రీడా ప్రాంగణం కార్యక్రమం కింద ఖాళీ స్థలాలను ఎంపిక చేసి పిల్లలు ఆడుకునేందుకు అనువుగా తీర్చి దిద్దాలని ఆదేశించారు. దీంతో పాటు ఐదు వార్డులకు ఒక ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాగా పట్టణ ప్రగతి, హరితహారంపై ప్రతిమాసింగ్ శనివారం తూప్రాన్లోని మున్సిపల్ సమావేశ మందిరంలో కౌన్సిలర్లతో కలిసి ముందస్తు ప్రణాళిక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ పట్టణాల్లో చేపట్టిన మోడల్ ప్లాంటేషన్పై కౌన్సిలర్లకు ప్రొజెక్టర్తో ప్రజెంటేషన్ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ మోహన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.