వికాశ్ దూబే ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తుకు ఆదేశించిన యూపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-07-12T22:46:05+05:30 IST

కారు ప్రమాదం తర్వాత పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోబోయి ఎన్‌కౌంటరైన గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే

వికాశ్ దూబే ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తుకు ఆదేశించిన యూపీ ప్రభుత్వం

లక్నో: కారు ప్రమాదం తర్వాత పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోబోయి ఎన్‌కౌంటరైన గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే మరణంపై ఏక సభ్య స్వతంత్ర కమిషన్ దర్యాప్తు చేపట్టనుంది. రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని కమిషన్ రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన నివేదికను అందించనుందని ప్రభుత్వం తెలిపింది. దూబే అంత దుర్మారంగా ఎలా ఎదిగాడన్నదానిపై దర్యాప్తు జరపాలంటూ శనివారం ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే, దూబే మరణానికి సంబంధించి దర్యాప్తు చేసే పనిని దీనికి అప్పగించలేదు. సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్న సిట్ బృందం ఈ నెలాఖరు నాటికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. 


దూబే మరణంపై పోలీసులు చెబుతున్న దానికి, వీడియోలు, సాక్షి చెబుతున్నదానికి పొంతన లేకపోవడంతో అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు పోలీసుల వద్ద ఎటువంటి సమాధానం లేకపోవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేసిన వికాశ్ దూబేను కాన్పూరు తరలిస్తుండగా వాహనం బోల్తాపడిందని, ఆ సమయంలో దూబే తప్పించుకునే ప్రయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు.


దూబేను పట్టుకునేందుకు ప్రయత్నించామని, అయితే అతడు తమపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదకరమైన వికాశ్ దూబేను కారులో ఎందుకు తరలించాల్సి వచ్చింది? అతడికి బేడీలు ఎందుకు వేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

Updated Date - 2020-07-12T22:46:05+05:30 IST