నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు
ABN , First Publish Date - 2021-05-17T15:30:51+05:30 IST
కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించడానికి...
లక్నో: కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించడానికి యూపీలోని 23 జిల్లాలలో ఈరోజు నుంచి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి టీకాలు వేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి (మెడికల్ అండ్ హెల్త్) అమిత్ మోహన్ ప్రసాద్ మీడియాకు తెలియజేశారు. ఇప్పటి వరకు 18 జిల్లాలలో మాత్రమే 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇస్తున్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు కూడా విస్తరించారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 1,16,80,212 మందికి మొదటి మోతాదు వ్యాక్సిన్ ఇవ్వగా, 32,66,076 మందికి రెండవ మోతాదు వ్యాక్సిన్ ఇచ్చారు. గడచిన 24 గంటల్లో 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల 48,340 మందికి టీకాలు ఇచ్చారు. కాగా ఉత్తరప్రదేశ్లో కరోనా వ్యాప్తి రేటు కాస్త తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,682 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 311 మంది మృతిచెందారు. అలాగే గత 24 గంటల్లో 24,837 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 2,67,420 మందికి కరోనా టెస్టులు చేశారు.