Yogi Minister: దొంగతనం కేసులో దోషి.. తీర్పు వెలువడుతుండగానే కోర్టు నుంచి జారుకున్న మంత్రి

ABN , First Publish Date - 2022-08-07T01:22:43+05:30 IST

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ మంత్రికి కాన్పూరు జిల్లా కోర్టులో..

Yogi Minister: దొంగతనం కేసులో దోషి.. తీర్పు వెలువడుతుండగానే కోర్టు నుంచి జారుకున్న మంత్రి

కాన్పూర్: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ మంత్రికి కాన్పూరు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. బ్యాలస్ట్ (Ballast) దొంగతనం కేసులో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (Micro, Small and Medium Enterprises) మంత్రి రాకేష్ సచన్‌ (Rakesh Sachan)ను దోషిగా పేర్కొంటూ కోర్టు శనివారంనాడు తీర్పు చెప్పింది. కోర్టుకు హాజరైన మంత్రి ఈ కేసులో తీర్పు వెలువడానికి కొద్ది నిమిషాలకు ముందే కోర్టు నుంచి జారుకున్నట్టు చెబుతున్నారు. ఈ కేసులో మంత్రిని దోషిగా పేర్కొంటూ తీర్పు వెలువరించిన అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) శిక్షాకాలం మాత్రం ప్రకటించకుండా రిజర్వ్ చేశారు. కాగా, తీర్పు వెలువడిన క్షణాల్లోనే మంత్రి హడావిడిగా కోర్టు నుంచి నిష్క్రమించినట్టు అనధికార వర్గాల సమాచారం.


సచన్‌పై నమోదైన ఈ కేసు 35 ఏళ్ల క్రితం నాటిదని చెబుతున్నారు. అప్పట్లో సచన్‌పై బ్యాలస్ట్ (క్రష్ స్టోన్స్) దొంగతనం కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన కాన్పూరులో రైల్వే కాంట్రాక్టర్‌గా ఉన్నారు. దొంగతనానికి గురైన బ్యాలస్ట్‌ ఆ తరువాత దొరికింది. కూర్మి వర్గంలో పలుకుబడి కలిగిన నేతగా పేరున్న సచన్ ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. భోగ్నిపూర్ అసెంబ్లీ నుంచి బీజేపీ టిక్కెట్‌పై ఆయన పోటీ చేశారు. కూర్మీ వర్గం నేతగా ఆయనకు యోగి మంత్రివర్గంలో చోటు దక్కింది.


మంత్రి ఇల్లు కూడా కూల్చేస్తారా?

కాగా, దోషిగా తేలిన బీజేపీ మంత్రి ఇంటిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లతో కూల్చేస్తారో లేదో చెప్పాలని విపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేతలు కాన్పూర్ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిలదీశారు. అయితే కోర్టు తీర్పు గురించి తమకు తెలియదని బీజేపీ నేతలు కొందరు ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.

Updated Date - 2022-08-07T01:22:43+05:30 IST