17 ఏళ్ల బాలిక పరువు హత్య.. తండ్రి, సోదరుడి అరెస్టు
ABN , First Publish Date - 2022-04-23T20:46:21+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని బాండ జిల్లా గుర్హా కలా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికను ..
బాండ: ఉత్తరప్రదేశ్లోని బాండ జిల్లా గుర్హా కలా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికను తండ్రి, సోదరుడు కలిసి గొంతు నులిపి చంపారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. స్థానికుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్ట్మార్టం కోసం పంపారు. అనంతరం 'పరువు హత్య' కింద కేసు నమోదు చేశారు.
పోస్ట్మార్టం నివేదకలో గొంతు నులిమి చంపినట్టు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. ఇంతవరకూ అందిన సమాచారం ప్రకారం, తమ కులానికే చెందిన వ్యక్తితో బాలిక సంబంధాలు నడపడం ఆ కుటుంబానికి ఇష్టం లేదని తెలుస్తోందని డిప్యూటీ ఎస్పీ నితిన్ కుమార్ శనివారంనాడు తెలిపారు. బాలికలను హత్య చేసి ఇంటి వెనుకనున్న పశువులపాకలో పాతిపెట్టినట్టు సమాచారం అందడంతో శుక్రవారంనాడు మృతదేహాన్ని వెలికితీశామన్నారు. మృతదేహంపై గాయాలు సైతం ఉన్నాయన్నారు. బాలిక తండ్రి దేశ్రాజ్, సోదరుడు ధనంజయ్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు చెప్పారు.