హీరోను చూద్దామని వస్తే కత్తితో పొడిచి నిలువుదోపిడీ చేశారు...

ABN , First Publish Date - 2020-07-13T21:42:43+05:30 IST

ఓ బాలీవుడ్ హీరో దర్శనం కోసం ఉత్తర ప్రదేశ్ నుంచి ముంబై వచ్చిన ఓ వ్యక్తిని ఇద్దరు ఆకతాయిలు కత్తితో పొడిచి నిలువు దోపిడీ చేశారు...

హీరోను చూద్దామని వస్తే కత్తితో పొడిచి నిలువుదోపిడీ చేశారు...

 ముంబై: ఓ బాలీవుడ్ హీరో దర్శనం కోసం ఉత్తర ప్రదేశ్ నుంచి ముంబై వచ్చిన ఓ వ్యక్తిని ఇద్దరు ఆకతాయిలు కత్తితో పొడిచి నిలువు దోపిడీ చేశారు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఈ నెల 4న చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన అక్విల్ షేక్ (35) అనే వస్త్రాల వ్యాపారి గత నెల చివరి వారంలో ఓ హీరోను చూసేందుకు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ ముంబై వచ్చాడు. సదరు నటుడి బంగ్లా ముందు ఫుట్‌పాత్‌పై నిరీక్షిస్తూ గడిపాడు. అయితే ఈ నెల 4న ఇది గమనించిన నిందితులు సంజయ్ గోపి ఖ్వారా (25), సురేశ్ కాంజిఖ్వారా (20) ఇద్దరూ అక్విల్‌ని టార్గెట్ చేశారు.


ముందుగా అక్విల్‌ను మద్యం సేవించాలంటూ నిందితులు బలవంతం చేశారు. అయితే అందుకు అతడు నిరాకరించడంతో... నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లారు. మళ్లీ మద్యం తాగాలంటూ బలవంతపెట్టినా బాధితుడు నిరాకరించడంతో అతడిని వేధించడం మొదలు పెట్టారు. ఇంతలో నిందితుల్లో ఒకడు కత్తి తీసి అక్విల్ ఛాతీ, పొట్టలో పొడిచాడు. అనంతరం అతడి సెల్‌ఫోన్, డబ్బులు లాక్కుని పరారయ్యారు. స్థానికులు బాధితుడిని గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఘటనా ప్రాంతంలోని సీసీటీవీ ఫూటేజీల ఆధారంగా జుహు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని సబ్‌ ఇన్‌స్పెక్టర్ హరీశ్ బిరాదర్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-13T21:42:43+05:30 IST