Uttar Pradesh: కన్వర్ యాత్రలో అండర్ కవర్ పోలీసులు
ABN , First Publish Date - 2022-07-27T19:47:22+05:30 IST
శివభక్తులు ఏటా చేపట్టే 'కన్వర్ యాత్ర' పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ యాత్రలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా..
నొయిడా: శివభక్తులు ఏటా చేపట్టే 'కన్వర్ యాత్ర' (Kanwar Yatra) పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ యాత్రలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పశ్చిమ యూపీలో పలు చోట్ల అండర్ కవర్ పోలీసులు (Under cover police) కన్వరీలతో కలిసి వారి తరహా వేషధారణతో ముందుకు సాగుతున్నారు.
ముజఫర్నగర్లో వందలాది మంది పోలీసులు కాషాయం రంగు టీ-షర్లులు, షార్ట్లు, ట్రాక్ పాంట్లుతో కన్వరీల యాత్రలో పాల్గొంటున్నారు. గగనతలం నుంచి నిఘా కోసం డ్రోన్లను కూడా మోహరించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శివభక్తుల వార్షిక యాత్రలో ఉత్తరాఖండ్ సరిహద్దులోని ముజఫర్నగర్ చాలీ కీలకమైన జిల్లా అని, ఉత్తరాఖండ్కు వెళ్లే వారు ఈ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. 50 కిలోమీటర్ల మేర రోడ్ మార్గం ఉంటుందని తెలిపారు. ఉత్తరాఖండ్ నుంచి గంజా జలాలను సేకరించిన తర్వాత కన్వరీలు ముజఫర్నగర్ చేరుకుని అక్కడ్నించి మీరట్, షామ్లి, తదితర మార్గాల వైపు వెళ్తారని చెప్పారు. మామూలు భద్రతా ఏర్పాట్లతో పాటు, కన్వరీల వస్త్రధారణలో 400 నుంచి 500 మంది పోలీసు సిబ్బంది కన్వరీల ఊరేగింపులో పాల్గొని శాంతిభద్రతల పరిస్థితులపై నిఘా ఉంచుతారని చెప్పారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న రొటీన్ ప్రాక్టీస్ అని ఆయన చెప్పారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో సుమారు 750 కెమెరాలు ఉంచామని, కీలక మైన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలపై డ్రోన్లతో నిఘా ఉంచామని చెప్పారు. లక్షలాది కన్వరీల యాత్రలో పాల్గొంటారని, వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వారు వెళ్లే మార్గాల్లో పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని మోహరించినట్టు ముజఫర్ నగర్ సీనియర్ ఎస్పీ వినీత్ జైశ్వాల్ చెప్పారు. శాంతి భద్రతల పరిస్థితి అదుపులో ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నామని, సమస్యలు సృష్టించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.