రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన
ABN , First Publish Date - 2020-07-08T11:38:22+05:30 IST
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆరోపించారు.
ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్
సోంపేట, జూలై 7: రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆరోపించారు. మంగళవారం సోంపేటలో విలేకరులతో మాట్లాడుతూ సోంపేటలో గాంధీ పార్కును ఏ తీర్మానం చేసి కూల్చారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీలో పేదలకు అన్యాయం జరుగుతోందని, అనర్హులకు పట్టాలు అందుతున్నాయని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు, పింఛన్లు అందుతున్న వారికి ఇళ్ల పట్టా ల జాబితాలో స్థానం కల్పించారని చెప్పారు. వైసీపీ కండువా కప్పితేనే పట్టాలు అందుతున్నాయన్నారు.
గత ప్రభుత్వం సోంపేట మండలానికి రూ.468 కోట్లతో ఇంటింటికి నీటి పథకానికి నిధులు కేటాయించగా, ఈ పనులు కూడా నిలిపివేశారని ఆందోళన వ్యక్తంచేశారు. కొత్తగా 600 కోట్లతో నీటి పథకం ప్రారంభిస్తామని పేర్కొన్నా, ఒక్క పైసా కూడా కేటాయించలేదని ఆరోపించారు. తితలీ బాధితులను ఇచ్చిన హామీలు విస్మరించారని విమర్శించారు. పంచాయతీ తీర్మానాలు, అనుమతిలేకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తున్నార ని ప్రశ్నించారు.సోంపేట పంచాయతీకి సంబందించి కారు, ఆటో స్టాండుల్లో వసూలు చేస్తున్న ఆశీలు సాధారణ నిధికి ఎంత జమచేశారన్నారు. ప్రొటోకాల్ను పాటించడంలేదని,ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని కాదని, ఇతరులతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు.
తొలుత తహసీల్దార్ సదాశివుని గురుప్రసాద్ను కలిసి ఇళ్ల పట్టాల్లో జరుగుతున్న అవినీతి, జాబితాల్లో పేర్ల తొలగింపు, సోంపేట పంచాయతీలో జరుగుతున్న అవినీతి, గాంధీపార్కు కూల్చడంపై చర్చించారు. మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిత్రాడ శ్రీనివాసరావు, సూరాడ చంద్రమోహన్, టీడీపీ నాయకులు మద్దిల నాగేష్, చిత్రాడ శేఖర్, దూసి మధు, నిట్టగోపాల్, బాబూరావు, బి.ఆనందరావు, గోవింద్, ఎం.రవి పాల్గొన్నారు.