ఒంటరిగా వదిలేశారు : ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన

ABN , First Publish Date - 2022-02-25T15:27:54+05:30 IST

రష్యా పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉంటే ప్రపంచం

ఒంటరిగా వదిలేశారు : ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన

కీవ్ : రష్యా పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉంటే ప్రపంచం తమను  ఒంటరిగా వదిలేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాడి, తమ దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కేవలం తమపైనే పెట్టిందని వాపోయారు. గురువారం ఉదయం ప్రారంభమైన యుద్ధంలో దాదాపు 137 మంది ఉక్రెయిన్ సైనికులు, సాధారణ ప్రజలు మరణించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 


‘‘మన దేశాన్ని కాపాడుకోవడానికి మనల్ని ఒంటరిగా వదిలేశారు’’ అని వోలోడిమిర్ ఉక్రెయిన్ ప్రజలకు చెప్పారు. మన పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. తమ పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నట్లు తనకు కనిపించడం లేదన్నారు. ఉక్రెయిన్‌కు NATO సభ్యత్వంపై హామీ  ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిస్తూ, ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 137 మంది ఉక్రెయినియన్లు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో సైనికులు, సామాన్య ప్రజలు ఉన్నారని చెప్పారు. 316 మంది గాయపడినట్లు తెలిపారు. రష్యన్ విద్రోహ శక్తులు రాజధాని నగరం కీవ్‌లో ప్రవేశించాయని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కర్ఫ్యూను పాటించాలని కోరారు. 


తనను టార్గెట్ నెంబర్ వన్‌గా రష్యా గుర్తించినప్పటికీ, తాను, తన కుటుంబ సభ్యులు ఉక్రెయిన్‌లోనే ఉన్నామని తెలిపారు. దేశాధినేతను దెబ్బతీయడం ద్వారా రాజకీయంగా ఉక్రెయిన్‌ను నాశనం చేయాలని రష్యా కోరుకుంటోందన్నారు. 


Updated Date - 2022-02-25T15:27:54+05:30 IST