కుక్కలతో కరోనాకు చెక్..?

ABN , First Publish Date - 2020-05-16T23:56:22+05:30 IST

మత్తు, పేలుడు పదార్థాలను సైతం వాసనతో పసిగట్టగల గ్రామసింహాలు.. కరోనా గుట్టురట్టు చేయగలవో లేదో తెలుసుకునేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తల కొత్త అధ్యయానికి తెరలేపారు.

కుక్కలతో కరోనాకు చెక్..?

లండన్: కరోనాతో కలిసి జీవించక తప్పదనే అభిప్రాయానికి ప్రపంచ దేశాలన్నీ వచ్చేశాయి. ఈ క్రమంలోనే సడలింపులకు తెరలేపాయి. ప్రభుత్వాల ముందు మరో మార్గం లేకపోవడంతో అవి ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను గుర్తించి, తక్షణం ఐసోలేషన్‌కు తరలించడమనేది మరింత కీలకంగా మారింది. ఈ క్రమంలోనే బ్రిటన్‌లోని శాస్త్రవేత్తలు..జాగిలాలవైపు దృష్టిసారించారు. మత్తు, పేలుడు పదార్థాలను సైతం వాసనతో పసిగట్టగల గ్రామసింహాలు.. కరోనా గుట్టురట్టు చేయగలవో లేదో తెలుసుకునేందుకు కొత్త అధ్యయానికి తెరలేపారు.


కరోనా పేషెంట్ల నుంచి సేకరించిన శాంపిళ్లను జాగిలాలకు వాసన చూపించడం ద్వారా అవి ఆరోగ్య వంతులెవరో కరోనా వ్యాధిగ్రస్తులెవరో గుర్తించగలవలేదో పరిశీలించనున్నారు.  లాబ్రాడర్‌తో పాటూ కాకర్ స్పేనియల్ జాతి కుక్కలను ఈ అధ్యయనంలో పరిశీలించనున్నారు. డర్హమ్ యూనివర్సటి, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లు ఈ పరిశోధనను చేపట్టనున్నాయి. ఇందుకు కోసం ప్రభుత్వం 5 లక్షల పౌండ్లను కేటాయించింది. కాగా.. ఈ అధ్యయనంలో పాల్గొంటున్న మెడికల్ డిటెక్షన్ డాగ్స్ అనే స్వఛ్చంధ సంస్థ.. గతంలో కుక్కలకు క్యాన్సర్ పసిగట్టే శిక్షణ ఇచ్చింది. ఇక కరోనాను గుర్తుపట్టే సామర్థ్యం కుక్కలకు ఉందన్న విషయం రూఢీ అయితే గనుక..వీటిని బహిరంగా ప్రదేశాల్లో, ఎయిర్ పోర్టుల్లో వినియోగించే అవకాశం ఉంది. ఒక్కో జాగిలం ద్వారా గంటకు 250 మందిని కరోనా కోసం స్క్రీనింగ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2020-05-16T23:56:22+05:30 IST