‘ఉద్ధవ్కి వెన్నుపోటు’.. స్కెచ్ షేర్ చేసిన Shivasena ఎంపీ Sanjay Raut
ABN , First Publish Date - 2022-06-30T20:23:32+05:30 IST
శివసేన(Shivasena) చీఫ్ ఉద్ధవ్ థాక్రే(Uddav Thackerey) ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ విధేయులు ఉద్వేగానికి లోనవుతున్నారు. శివసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ముంబై : శివసేన(Shivasena) చీఫ్ ఉద్ధవ్ థాక్రే(Uddav Thackerey) ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ విధేయులు ఉద్వేగానికి లోనవుతున్నారు. శివసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. సంక్షోభంలో ఆది నుంచీ ఉద్ధవ్కి వెన్నుదన్నుగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) మహారాష్ట్ర సంక్షోభాన్ని ‘ఉద్ధవ్ థాక్రేకి వెన్నుపోటు’గా అభివర్ణించారు. ఈ మేరకు గురువారం ట్విటర్లో వెన్నుపోటును ప్రతిబింబించే స్కెచ్(ఒక ఊహాచిత్రం)ని షేర్ చేశారు. ‘వాస్తవంగా జరిగిందిదే ’ అని ఆయన క్యాప్షన్ ఇచ్చారు. ప్రతీకాత్మక స్కెచ్లో తెల్లటి కుర్తా ధరించిన ఉద్ధవ్ థాక్రే వెనుదిరిగి ఉన్నారు. చేతులు రెండూ లేవు. వీపుపైన కుర్తాపై మూడు కత్తిగాటు గుర్తులు.. రక్తం కారుతున్నట్టుగా ఉన్నాయి. మొత్తంగా ఉద్ధవ్ థాక్రేని రెబల్ ఎమ్మెల్యేలు వెన్నుపోటు పొడిచారనే విధంగా స్కెచ్ గీశారు.
కాగా గతవారం ఏక్నాథ్ షిండే(Ekanth Shinde) సారధ్యంలోని 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. అప్పటి నుంచీ ముఖ్యమంత్రి పదవి తనకు అక్కర్లేదని ఉద్ధవ్ థాక్రే చెబుతూ వచ్చారు. బలనిరూపణ చేసుకోవాలంటూ సుప్రీంకోర్ట్ కూడా చెప్పడంతో బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ వాళ్లే తనను కాదనుకుంటే.. అధికారానికి అతుక్కుపోవడం తనకు ఇష్టంలేదని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.