రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2021-04-17T05:11:42+05:30 IST
చాగలమర్రి మండలం ఇడమడక గ్రామ మెట్ట వద్ద రహదారిపై కారు, స్కూటర్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మరణించారు.
- చాగలమర్రి ఇడమడక వద్ద కారు, స్కూటర్ ఢీ.. ఇద్దరి మృతి
- కాల్వబుగ్గ సమీపాన డివైడర్ను ఢీకొని మరొకరి మృతి
చాగలమర్రి, ఏప్రిల్ 16: చాగలమర్రి మండలం ఇడమడక గ్రామ మెట్ట వద్ద రహదారిపై కారు, స్కూటర్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మరణించారు. అలాగే ఓర్వకల్లు మండలం కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి 40పై కాల్వబుగ్గ గ్రామ సమీపాన కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఎదుట ద్విచక్ర వాహనం డీవైడర్ను ఢీకొని ఒకరు మృతి చెం దారు. ఈ రెండు ఘటనలు శుక్రవారం జరిగాయి. ఇడమడకకు చెందిన రమణయ్య(45), బాలనాగమ్మ(48) టీవీఎస్ వాహనంపై రోడ్డు దాటి మెట్ట వద్ద నిలిచి ఉన్న మాధవితో మాట్లాడుతుండగా చాగలమర్రి నుంచి మదనపల్లెకు పూల బస్తాలను తీసుకెళ్తున్న కారు ఢీకొట్టింది. టీవీఎస్ వాహనం రోడ్డుపక్కన గుంతలో పడి దెబ్బతిన్నది. ఢీకొట్టిన కారు గుంతలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ఉన్నవారు చాగలమర్రిలోని కేరళ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ రమణయ్య, బాలనాగమ్మ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మాధవిని ఆళ్లగడ్డ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున వైద్యశాలకు తరలివచ్చారు. ఎస్ఐ కులాయప్ప, పోలీసులు వైద్యశాలకు చేరుకొని జరిగిన సంఘటనపై విచారించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఓర్వకల్లు: కడప జిల్లా చక్రాయిపేట మండలం ఆంజనేయపురం గ్రామానికి చెందిన గంగిశెట్టి((49) తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా గద్దలూరులో నర్సరీ ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు. ఉగాది పర్వదినాన స్వగ్రామానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి గద్వాలకు వెళ్తూండగా.. ఓర్వకల్లు మండలం కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి 40పై కాల్వబుగ్గ గ్రామ సమీపాన కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఎదుట ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.