రెండు ద్విచక్రవాహనాల ఢీ: ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-09-23T10:36:20+05:30 IST

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, ముగ్గురు గాయపడిన సంఘటన మదనపల్లె మండలంలో జరిగింది.

రెండు ద్విచక్రవాహనాల ఢీ: ఒకరి మృతి

మదనపల్లె క్రైం, సెప్టెంబరు 22: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, ముగ్గురు గాయపడిన సంఘటన మదనపల్లె మండలంలో జరిగింది. తాలూకా పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మాలేపాడు పంచాయతీ వెంకటన్నగారిపల్లెకు చెందిన ఎం.ఈశ్వరప్ప(68) వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. కాగా, మంగళవారం ఆయన పచ్చిపాలవారిపల్లెకు చెందిన దాయాది ఆనంద్‌(40)తో కలసి సొంత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లె వెళ్లారు.


అనంతరం స్వగ్రామానికి బయలుదేరి మాలేపాడు సమీపంలోని ఎర్రకణం మలుపు వద్దకు వచ్చారు. అదే సమయంలో మదనపల్లె గౌతమీనగర్‌కు చెందిన నరసింహులు(23), తన స్నేహితుడు దేవళంపల్లెకు చెందిన కుమార్‌(24)తో కలసి ద్విచక్రవాహనంలో ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నారు.


క్షతగాత్రులను 108 సిబ్బంది మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఈశ్వరప్ప మృతిచెందారు. కాగా, మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ దిలీప్‌ చెప్పారు.

Updated Date - 2020-09-23T10:36:20+05:30 IST