వేర్వేరు వాహన ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-07-25T06:03:17+05:30 IST

కలికిరి మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు వాహన ప్రమాదాల్లో మండలానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు.

వేర్వేరు వాహన ప్రమాదాల్లో ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకట్రమణ

కలికిరి, జూలై 24: కలికిరి మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు వాహన ప్రమాదాల్లో మండలానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మర్రికుంటపల్లె పంచాయతీ కొత్తహరిజనవాడకు చెందిన అమ్మిటి వెంకట్రమణ (44) కలికిరి నుంచి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా కొత్తగజ్జలవారిపల్లె వద్ద అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. పోలీసులు వెంకట్రమణను 108 ద్వారా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందాతతడు. 


ట్రాక్టర్‌ ప్రమాదంలో మరో యువకుడు..

వరి నాట్ల కోసం సిద్ధం చేస్తున్న పొలంలో ఇరుక్కున్న ట్రాక్టరు వెలికి తీసే ప్రయత్నంలో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మేడికుర్తి పంచాయతీ మజ్జిగగొల్లపల్లెకు చెందిన బోడె మహదేవ కుమారుడు బి.నాగార్జున (30) కలికిరిలోని ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరరుగా పనిచేస్తున్నాడు. గ్రామానికి చెందిన ఒక రైతు పొలం బురదలో ఇరుక్కు పోయిన ట్రాక్టర్‌ను వెలికి తీసేందుకు నాగార్జున ప్రయత్నించాడు. ట్రాక్టర్‌ ఇంజిన్‌ స్పీడు ఒక్కసారిగా పెంచడంతో ముందు భాగం పైకి లేచి వెనక్కు తిరగబడింది. దీంతో నాగార్జున ఇంజనుకు, నాగళ్లకు మధ్యలో ఇరుక్కుపోయాడు. స్థానికులు అతన్ని వెలికితీసి కలికిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరిం చారు. నాగార్జునకు తల్లిదండ్రులు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది.  

Updated Date - 2021-07-25T06:03:17+05:30 IST