రెండు లారీలు ఢీ: డ్రైవర్‌కు గాయాలు

ABN , First Publish Date - 2020-12-05T06:36:46+05:30 IST

రెండు లారీలు ఢీకొనడంతో ఓ లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

రెండు లారీలు ఢీ: డ్రైవర్‌కు గాయాలు

అంబాజీపేట, డిసెంబరు 4: రెండు లారీలు ఢీకొనడంతో ఓ లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అమలాపురంలో రొయ్యలమేత దిగుమతి చేసి  నిడదవోలు వెళ్తున్న లారీని సిమెంట్‌ లోడతో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో నిడదవోలుకు చెందిన డ్రైవర్‌ తోట రత్నబాలాజీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. దీంతో స్థానికులు అతడిని బయటకు తీశారు.  బాలాజీని అమలాపురం ఆసుపత్రికి తరలించారు.   సిమెంట్‌ లారీ డ్రైవర్‌ గాలెం రవిపై కేసు నమోదు చేసిన్నట్టు ఎస్‌ఐ షేక్‌ జానీబాషా తెలిపారు.


విద్యుత్‌ శాఖ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి

విద్యుత్‌ శాఖ ఉద్యోగుల ఆందోళన

యానాం, డిసెంబరు 4: విద్యుత్‌శాఖ ప్రైవేటీకరణను నిరసిస్తూ యానాం విద్యుత్‌ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి శుక్రవారం ఉదయం  కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అందోళనకు యానాం ఉద్యోగులు మద్దతు తెలిపారు.  విద్యుత్‌ శాఖను ప్రైవేటీకరణ చేస్తే కలిగే నష్టాలను పలువురు ఉద్యోగులు వివరించారు.  కార్యక్రమంలో యానాం విద్యుత్‌శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధంకావాలి

తాళ్లరేవు, డిసెంబరు 4: ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై టీడీపీ కార్యకర్తలు పోరాటానికి సిద్ధం కావాలని టీడీపీ మండలాధ్యక్షుడు దున్నా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం లయన్స్‌క్లబ్‌హాల్‌లో కార్యదర్శి వాడ్రేవు వీరబాబు అధ్యక్షతన  జరిగిన టీడీపీ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగసూర్యనారాయణ, కట్టా త్రిమూర్తులు, ధూళిపూడి వెంకటరమణ, వుంగరాల వెంకటేశ్వరరావు, కుడిపూడి రామకృష్ణ, మాజీసర్పంచ్‌ వాసంశెట్టి శ్రీనివాస్‌, అల్లూరి రామకృష్ణంరాజు  పాల్గొన్నారు.


బోడసకుర్రు రీచ్‌లో మైన్స్‌శాఖ దాడులు

అల్లవరం, డిసెంబరు 4: బోడసకుర్రు రీచ్‌లో మైనింగ్‌ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. ఇసుక లోడింగ్‌ యంత్రాలతో వద్దని, మనుషులతో చేపట్టాలని అధికారులు సూచించారు. మైన్స్‌శాఖ, ఇరి గేషన్‌, రెవెన్యూ, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన  దాడుల్లో మైన్స్‌ అధికారులు,  ఎస్‌ఐ బి.ప్రభాకరరావు, వీఆర్వో చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీవెంకటేశ్వరా బోట్స్‌మెన్‌ అండ్‌ ఫిషర్‌మెన్‌ సొసైటీ ద్వారా జరుగుతున్న ఇసుకతీత పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.



 అర్థిక ఇబ్బందుల్లో పన్నులు పెంపా?:  వేగుళ్ల

 మండపేట, డిసెంబరు 4: ప్రజలపై పన్నుల భారం, నిత్యావసరాల ధరలు పెంచుతున్న ప్రభుత్వ తీరును ప్రజల తరపున అసెంబ్లీలో టీడీపీ ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం తమ గొంతు నొక్కుతుందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. పట్టణాల్లో ఇంటి పన్నుల పెంపుపై టీడీపీ అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విదుదల చేశారు. పన్నుల పెంపు బిల్లును తాము వ్యతిరేకించామన్నారు. పన్నుల పెంపునకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సభ నుంచి వాకౌట్‌ చేశామన్నారు.  


Updated Date - 2020-12-05T06:36:46+05:30 IST