పెళ్లి చేసుకున్నాం, పెద్దల నుంచి రక్షించమంటూ పోలీస్ స్టేషన్‌కు చేరిన యువజంట.. వారిని చూసి షాకైన పోలీసులు.. చివరకు..

ABN , First Publish Date - 2022-02-08T17:50:02+05:30 IST

ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం చాలా దేశాల్లో సాధారణ విషయంగా మారిపోయింది.

పెళ్లి చేసుకున్నాం, పెద్దల నుంచి రక్షించమంటూ పోలీస్ స్టేషన్‌కు చేరిన యువజంట.. వారిని చూసి షాకైన పోలీసులు.. చివరకు..

ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం చాలా దేశాల్లో సాధారణ విషయంగా మారిపోయింది. స్వలింగ వివాహాలను చాలా దేశాలు ఆమోదిస్తున్నాయి. అయితే భార‌త్‌లో మాత్రం ఇలాంటి పెళ్లిళ్లను సమాజం, తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో అంగీకరించడం లేదు. అలాంటి పెళ్లిళ్లు ఆసియా దేశాల్లో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ప్రేమించుకొని ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో సంచలనం రేకెత్తించింది. 


ధన్‌బాద్‌లో ఉంటున్న రాఖీ మిర్ధా (24), కరిష్మా రావత్ (23) అనే యువతులు చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోరనే భయంతో ఇళ్ల నుంచి పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తాము పెళ్లి చేసుకున్నామని, జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నామని, తమకు రక్షణ కల్పించాలని అడిగారు. ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకోవడాన్ని మొదట పోలీసులు కూడా జీర్ణించుకోలేకపోయారు.


తర్వాత విషయం అర్థం చేసుకుని ఇద్దరమ్మాయిల కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించారు. వీరిద్దరి పెళ్లి గురించి తెలిసి వారి కుటుంబ సభ్యులు కూడా మొదట ఆశ్చర్యపోయారు. అమ్మాయిలిద్దరికీ ఎంతగానో నచ్చ చెప్పారు. అయినా వారు వినలేదు. కొన్ని గంటల పాటు అమ్మాయిలకు, వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ అమ్మాయిలిద్దరినీ వారి తల్లిదండ్రులతో పాటు ఇళ్లకు పంపారు. 

Updated Date - 2022-02-08T17:50:02+05:30 IST