నెట్టింట్లో అస్సాం, మిజోరాం పోరు
ABN , First Publish Date - 2021-07-29T01:11:39+05:30 IST
ఇరు రాష్ట్రాల మధ్య లుషాయ్ కొండలు, బరాక్ లోయ, నదులు, అడవుల విషయంలో వివాదం సరిహద్దులో పెద్ద వివాదాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకున్నారు
గువాహటి: అస్సాం, మిజోరాం రాష్ట్రాల మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులు సోషల్ మీడియాను సైతం కుదిపివేస్తున్నాయి. నెట్టింట్లో ఇరు రాష్ట్రాల నెటిజెన్లు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ట్విట్టర్లో ‘షేమ్ ఆన్ యూ అస్సాం’ అని మిజోరాం నెటిజెన్లు ట్రోల్స్ చేస్తుంటే ‘షేమ్ ఆన్ యూ మిజోరాం’ అంటూ అస్సామీలు ప్రతిదాడికి దిగారు. ఇక ట్విట్టరాటీల విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అస్సాం మద్దతుదారులైన కొంత మంది నెటిజెన్లు ‘మయమన్మార్కు మిజోరాం డ్రగ్స్ సరఫరా చేస్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యాలు చేస్తున్నారు. మిజోరాం వైపు నుంచి కూడా ఇదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ‘‘పోలీసులను బలగాలను దింపి మిజోరాం ప్రజలపై దాడులు చేస్తున్నారు’’ అంటూ అస్సాంపై విరుచుకుపడుతున్నారు.
ఇరు రాష్ట్రాల మధ్య లుషాయ్ కొండలు, బరాక్ లోయ, నదులు, అడవుల విషయంలో వివాదం సరిహద్దులో పెద్ద వివాదాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకున్నారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కల్పించుకోవాలంటూ విజ్ణప్తులు కూడా చేశారు. అయితే కేంద్రం సూచనల మేరకు అస్సాం పోలీసులు 100 మీటర్లు వెనక్కి తగ్గినప్పటికీ మిజోరాం పోలీసులు మాత్రం సాయుధులై అక్కడే తిష్ట వేశారు. అనంతరం అసోం ప్రభుత్వం కచార్లో మూడు బెటాలియన్ల కమాండోలను సరిహద్దులో మోహరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా, ఈ ఉద్రిక్తతలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తీవ్రంగా స్పందించారు. హోంమంత్రి అమిత్షా ఈ దేశాన్ని ఫెయిల్ చేయిస్తున్నారంటూ ట్విటర్లో విమర్శించారు.