పార్టీకి ద్రోహం చేసింది ఆయనే..
ABN , First Publish Date - 2021-12-26T14:16:46+05:30 IST
అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ పేరు ప్రస్తావించకుండా పార్టీకి ద్రోహం చేసినవారి తప్పులను క్షమించి మళ్ళీ పార్టీలో చేర్చుకోవాలంటూ ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం చెప్పిన
- క్షమాపణలు చెప్పాల్సింది శశికళ కాదు, ఓపీఎస్సే!
- టీటీవీ దినకరన్ ధ్వజం
చెన్నై: అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ పేరు ప్రస్తావించకుండా పార్టీకి ద్రోహం చేసినవారి తప్పులను క్షమించి మళ్ళీ పార్టీలో చేర్చుకోవాలంటూ ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం చెప్పిన పిట్టకథపై అమ్మామక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్ ధ్వజమెత్తారు. ‘తప్పు చేసింది ఎవరు? పార్టీకి ద్రోహం చేసింది ఎవరు? ఎవరి వల్ల ఎవరు అధికారం చెలాయించారనే విషయం లోకమంతటికీ తెలుసు’ అని దినకరన్ తీవ్రంగా స్పందించారు. శనివారం పార్టీ తరఫున జరిగిన క్రిస్మస్ వేడుకల్లో దినకరన్ మాట్లాడుతూ... అన్నాడీఎంకే నేతలపై విరుచుకుపడ్డారు. వాస్త వానికి అన్నాడీఎంకేకు తీరని ద్రోహం చేసింది పన్నీర్సెల్వమేనని, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు మద్దతుగా శాసనసభలో అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వ్యక్తి ఆయననే ఆరోపించారు. పార్టీకి తీరని ద్రోహం చేసిన పన్నీర్సెల్వమే తమకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మామక్కల్ మున్నేట్ర కళగంకు చెందిన తాము, శశికళ ప్రస్తుతమున్న అన్నాడీఎంకే నాయకులకు క్షమాపణలు చెప్పే ప్రసక్తేలేదని అన్నారు. తప్పుచేసిన అన్నాడీఎంకే నాయకులంతా క్షమాపణలు తెలుపుకుని తమ వర్గంలో విలీనం కావాలే తప్ప, తాము ఆ పార్టీలో చేరే ప్రసక్తే వుండదని స్పష్టం చేశారు. పన్నీర్సెల్వం తనకు మేలు చేసిన శశికళను గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. శశికళ వల్లే పన్నీర్సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి, మాజీ మంత్రి జయకుమార్ సహా అందరూ అధికారం చెలాయించారని, వీరందరినీ తన విశ్వాసులుగా భావించే ఆమె జైలుకు వెళ్ళారని, ఈ వాస్తవం ప్రపంచ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ఇకనైనా పార్టీకి తీరని ద్రోహం చేసిన పన్నీర్సెల్వం ఇలాంటి దుష్ర్పాచారాలను మానుకుంటే మంచిదని దినకరన్ హితవు పలికారు.