14న త్రివర్ణ ప్రకాశం
ABN , First Publish Date - 2022-08-11T06:06:13+05:30 IST
చరిత్రలో నిలిచిపోయేలా త్రివర్ణ ప్రకాశం కార్యక్రమాన్ని ఈనెల 14న ఒంగోలులో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్కుమార్ వెల్లడించారు.
జాతీయ జెండాతో 3కే రన్
కలెక్టర్ దినేష్కుమార్ వెల్లడి 8 పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు (కలెక్టరేట్), ఆగస్టు 10: చరిత్రలో నిలిచిపోయేలా త్రివర్ణ ప్రకాశం కార్యక్రమాన్ని ఈనెల 14న ఒంగోలులో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్కుమార్ వెల్లడించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా మూడు కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో 3కే రన్ నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక ప్రకాశం భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14వతేదీ ఉదయం 7గంటలకు నగరంలోని రవిప్రియా మాల్ వద్ద నుంచి మినీస్టేడియం వరకు ఈ వాక్ ఉంటుందన్నారు. మూడు మీటర్ల వెడల్పు, 2,450 కిలోల బరువు ఉండే జాతీయజెండాను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని, సమరయోధుల పోరాటాలను భావితరాలకు తెలియజేసి వారిలో దేశభక్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల వారు, మాజీ సైనికులు, రైతులు, డాక్టర్లు, లాయర్లు, ఎన్సీసీ కార్యకర్తలు ఇందులో పాల్గొంటారన్నారు. మినీస్టేడియంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం త్రివర్ణ ప్రకాశం పోస్టర్ను డీఆర్వో సరళావందనం, డీఈఐఈ గ్రేస్ లినోరాతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.