ఆదివాసీ గ్రామాలకు దారేది

ABN , First Publish Date - 2022-08-07T04:24:57+05:30 IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఆదివాసీ గ్రామాల దశ మారుతుందని ప్రజలు సంబరపడ్డారు. ఆదివాసీ గూడాలను, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతో కనీస వసతులు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆశించారు. అయితే ప్రజల ఆశలన్నీ అడియాశలుగానే మిగిలాయి. జన్నారం మండలంలోని లోతొర్రె గ్రామపం చాయతీగా ఏర్పడింది. గ్రామపంచాయతీ పరిధిలో చిన్న లొతొర్రె, లక్ష్మీపూర్‌ తండా, పాత లక్ష్మీపూర్‌ తండా, గోండుగూడెం ఉన్నాయి.

ఆదివాసీ గ్రామాలకు దారేది
కొత్తూరుపల్లి, లక్ష్మీపూర్‌ తండా వాగును దాటుతున్న లోతొర్రె, లక్ష్మీపూర్‌ గ్రామాల ప్రజలు

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

గ్రామపంచాయతీగా ఏర్పడ్డా తీరని కష్టాలు

పట్టించుకోని ప్రభుత్వం 

జన్నారం, ఆగస్టు 6: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఆదివాసీ గ్రామాల దశ మారుతుందని ప్రజలు  సంబరపడ్డారు. ఆదివాసీ గూడాలను, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతో కనీస వసతులు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆశించారు. అయితే ప్రజల ఆశలన్నీ అడియాశలుగానే మిగిలాయి. జన్నారం మండలంలోని లోతొర్రె గ్రామపం చాయతీగా ఏర్పడింది. గ్రామపంచాయతీ పరిధిలో చిన్న లొతొర్రె, లక్ష్మీపూర్‌ తండా, పాత లక్ష్మీపూర్‌ తండా, గోండుగూడెం ఉన్నాయి. ఇందులో సుమారు 300లకు పైగా కుటుంబాలుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో పూర్తి సంబంధాలు తెగిపోతాయి. దీంతో వాగు ఉధృతి తగ్గేంత వరకు వేచి చూడాల్సిందే. కింద వాగు ఉప్పొంగడం, పైన కడెం కెనాల్‌ ప్రవహించడంతో కనీసం బయటకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. 

ప్రతిపాదనలు చేశారే తప్ప ఆచరణ శూన్యం  

గ్రామానికి వెళ్ళాలంటే కొత్తూరుపల్లె, దేవునిగూడం, బంగారు తండా గ్రామాల నుంచి వెళ్లేందుకు దారులు ఉన్నాయి.  ఏ దారి నుంచి వెళ్లాలన్నా ఈ గ్రామం చుట్టూ ఉన్న వాగు దాటాల్సిందే. వాగుపై వంతెన లేక,  సరైన రోడ్డు లేక పోవడంతో ఐటీడీఏ అధికారులు రూ.30 లక్షలతో వంతెన నిర్మాణం చేపట్టాలని, రోడ్డు నిర్మాణానికి మరో రూ.50 లక్షలు ఖర్చవుతుందని ప్రతిపాదనలు పంపినా కాగితాలకే పరిమితమయ్యాయి.  

ఆపద వస్తే అంతే..

వర్షాకాలంలో ఆదివాసీ గిరిజన గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలుతాయి. గర్భిణులు ఆసుపత్రికి వెళ్లాలంటే వాగు ఉధృతి తగ్గిన తర్వాతనే వెళ్లాల్సి ఉంటుంది. గతంలో విష జ్వరాల బారిన పడిన  గ్రామస్తులు వాగు దాటలేక ఇబ్బందులు పడ్డారు. 

మరిన్ని గ్రామాలు 

మండలంలో ముఖ్యంగా లోతొర్రె గ్రామపంచాయతీతోపాటు మల్యాల, అల్లినగర్‌, దొంగపల్లి, సింగరాయిపేట, నర్సింగాపూర్‌ గ్రామాలకు వెళ్లేందుకు రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రోడ్డు సౌకర్యాలు కల్పించి వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు. 

వంతెన నిర్మించాలి

ఆత్రం లక్ష్మీ, సర్పంచు 

లోతొర్రె గ్రామానికి వెళ్లేందుకు వంతెన నిర్మిస్తే ప్రజలు సమయానికి ఆసుపత్రికి వెళ్లగలుతారు.  ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే వారే లేరు. వాగుపై బ్రిడ్జి నిర్మించాలి. 

రోడ్డు సౌకర్యం కల్పించాలి

శంకర్‌నాయక్‌, ఉపసర్పంచు 

ఈ గ్రామాలకు రావాలంటే మూడు దారులు ఉన్నాయి. ప్రతి దారిలో వాగు ఉప్పొంగడమే కాకుండా వర్షాకాలంలో నడిచే పరిస్థితి లేకుండా ఉంటుంది. అధికారులు రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఇప్పటికే ప్రతిపాదనలు చేశారు. వంతెన నిర్మించాలి. 


Updated Date - 2022-08-07T04:24:57+05:30 IST