కందకం పనుల అడ్డగింత

ABN , First Publish Date - 2022-03-21T04:34:56+05:30 IST

మండల పరిధిలోని రాఘవాపురం, రేగళ్లరేంజి, కిచ్చనపల్లి, రాయిపాడు, టేకులపల్లి, మొట్లగూడెం బీట్‌ లో అటవీ శాఖాధికారులు చేపడుతున్న కందకం పనులను రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు.

కందకం పనుల అడ్డగింత
రాఘవాపురంలో ట్రంచ్‌ పనులకు అడ్డుకున్న సాగుదారులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు

ఆళ్లపల్లి, మార్చి 20: మండల పరిధిలోని రాఘవాపురం, రేగళ్లరేంజి, కిచ్చనపల్లి, రాయిపాడు, టేకులపల్లి, మొట్లగూడెం బీట్‌ లో అటవీ శాఖాధికారులు చేపడుతున్న కందకం పనులను రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. రాఘవాపురంలో జడ్పీటీసీ కొమరం హనుమంతరావు, కో-ఆపరేటివ్‌ చైర్మన్‌ గొగ్గల రామయ్య, సర్పంచులు ప్రేమకళ, శంకర్‌బాబు, నిర్మల, వెంకటనారాయణ, నర్సింహరావు, పనులను అడ్డుకోగా, రాయిపాడులో సర్పంచ్‌ ఈశ్వరి, ఉపసర్పంచ్‌ ఎర్రయ్య కందకం పనులు అడ్డుకున్నారు. తక్షణం పోడుభూముల్లో నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సమావేశంలో తమ వినతి మేరకు కలెక్టర్‌ పోడుభూముల జోలికి వెళ్లొద్దని అటవీశాఖకు ఆదేశాలు జారీ చేసినా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

అధికార, ప్రతిపక్ష నాయకులు కందకం పనులు అడ్డుకోవడంతో అటవీశాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. పై స్థాయి అధికారుల నుంచి కందకం పనులు నిర్వహించాలని ఒత్తిళ్లు వస్తున్నాయి. మరోవైపు రైతుల నుంచి ప్రతిఘటన తప్పకపోవడంతో చేసేదేమిలేక మరో రెండు రోజుల్లో పోలీస్‌ బలగాలతో అటవీశాఖ కందకం పనులు నిర్వహించేందుకు సిద్ధపడుతునట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో కిచ్చనపల్లి బీట్‌లో హరితహారం మొక్కలు నాటే క్రమంలో ఓ అటవీశాఖ అధికారిపై విప్లవ దళం దాడి చేసింది. దీంతో అక్కడ పోలీస్‌ బలగాల భద్రత మధ్య మొక్కలు నాటారు. కందకం పనులు అడ్డుకునేందుకు నాయకులు, రైతులు వస్తుండటంతో ఈసారి కూడా పోలీసుల సహకారం తీసుకోవాలని అటవీశాఖ భావిస్తోంది. మరో రెండు రోజుల్లో కందకం తవ్వే పనులు ప్రారంభింపజేయాలని యోచిస్తోంది.


Updated Date - 2022-03-21T04:34:56+05:30 IST