నిరుద్యోగ యువతకు శిక్షణ అందించాలి
ABN , First Publish Date - 2022-07-01T06:42:41+05:30 IST
జిల్లాలోని నిరుద్యోగ యువతను అన్నీ ప్రభుత్వ శాఖలు గుర్తించి ఉపాధి కల్పన కోసం పబ్లిక్ డిమాండ్లో ఉన్నా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి అందులో శిక్షణ పొందిన వారికి నాబార్డ్, ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పోగ్రాం కింద యూనిట్లస్థాపన కోసం రుణాలను అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు.
- కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 30: జిల్లాలోని నిరుద్యోగ యువతను అన్నీ ప్రభుత్వ శాఖలు గుర్తించి ఉపాధి కల్పన కోసం పబ్లిక్ డిమాండ్లో ఉన్నా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి అందులో శిక్షణ పొందిన వారికి నాబార్డ్, ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పోగ్రాం కింద యూనిట్లస్థాపన కోసం రుణాలను అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లోని ఐడీవోసీ సమావేశమందిరంలో గురువారం సాయంత్రం జిల్లా స్కిల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా న్యాచురల్ డైయింగ్, గణేష్ ప్రతిమల తయారీ, హైండ్ మేడ్ పేపర్ మేకింగ్, లీప్ ప్లేట్ మేకింగ్, మట్టి బ్రిక్స్ తయారీ, తదితర అంశాలపై నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలోని టాస్క్ ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగయువతకు శిక్షణ కార్యక్రమాలను స్థానికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. లైవ్లీహూడ్ బిజెనెస్ ఇంక్యుబేటర్ కింద జిల్లాకు మంజూరైన కోటి రూపాయలతో జూకీ, ఎండ్రీయిడరీ, కంప్యూటర్ మిషన్ అంశాలలో తంగళ్లపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీపూర్ రోడ్డులోని గిరిజన సంక్షేమ గురుకులు ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేస్తున్న గిరిజన యువతులకు శిక్షణ ఇప్పించాలని అన్నారు. టాస్క్ ద్వారా హోటల్ మేనేజ్ మేంట్ కోర్సులలో శిక్షణ ఇప్పించేందుకు సంవత్సరం శిక్షణ కోసం క్యాలెండర్ను సిద్ధం చేయాలని అన్నారు. ఐటీడీఆర్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా నిరుద్యోగ యువతను గుర్తించి ఆసక్తిగల అభ్యర్థులకు లైట్ మోటార్, హెవీ మోటార్లలో శిక్షణ ఇప్పించాలని అన్నారు. వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతకు నాబార్డ్తో పాటు ప్రధానమంత్రి ఎప్లాయిమెంట్ జనరేషన్ పథకం కింద యూనిట్ల స్థాపనకు అర్తిక సహాయం అందిస్తామని అన్నారు.
పరిశ్రమల స్థాపనకు సహాకారాలు అందించాలి
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు పూర్తి సహాయ, సహాకారాలను సంబందిత అధికారులు అందించాలని కలెక్టర్ అదేశించారు. టీపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులను సత్వరమే సకాలంలో ఇవ్వాలని అన్నారు. టీ ప్రైడ్ పథకం ద్వారా 29 మందికి రవాణా వాహానాలు కొనుగోలు చేసిన వారికి సబ్సిడీనీ మంజూరు చేయాలని అన్నారు. గంభీరావుపేట మండలం నర్మాల పుడ్ పారిశ్రామిక వాడలో స్థాపించబోయే అగస్య పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కావాల్సిన వసతులు కల్పించాలని పరిశ్రమల శాఖ అఽధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్, జిల్లా అఽధికారలు పాల్గొన్నారు.