పామూరులో జఠిలంగా మారిన ట్రాఫిక్
ABN , First Publish Date - 2021-03-08T05:25:15+05:30 IST
పామూరు పట్టణంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు విస్తరణ పనులు జరగక పోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది.
ఆక్రమణలతో కుచించుకు పోతున్న రోడ్లు
సీసీ కెమెరాలు ఉన్నా స్పందించని పోలీసులు
పామూరు, మార్చి 7: పామూరు పట్టణంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు విస్తరణ పనులు జరగక పోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. నిత్యం వివిధ పనులపై పామూరు మండలంతో పాటు వరికుంటపాడు సీఎ్సపురం పీసీపల్లి, మండలాలకు చెంది న ప్రజలు తమ వ్యాపార లావాదేవీల కోసం పామూరుకు వస్తుంటారు. ఉన్న కొద్దిపాటి రోడ్లను సైతం వ్యాపారులు ఆక్రమించుకొని పోటీ పడుతూ ముందుకు చొచ్చుకు రావడంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో పాటు ద్విచక్ర వాహనాలను ఎక్కడబడితే అక్కడ రోడ్లపైనే అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. పట్టణంలో ముఖ్యంగా మమ్మీడాడీ సెంటర్, పాత ఎస్బీఐ రోడ్డు, సీఎ్సపురం రోడ్డు సెంటర్లో ఈ సమస్య ప్రతి రోజూ ఉత్పన్నమవుతుంది. రోడ్డుకు బస్సులు నడిచే పరిస్థితి నుండి నేడు ఒక్క బస్సు కూడా సరిగా వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ చిన్న కారణంగా బస్సు రోడ్డుపై ఒక్క సెకను నిలిస్తే, వెనుకవైపు వందలాది వా హనాలు నిలబడిపోతున్నాయి. ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలువల పైన షాపు నిర్వాహకులు షెట్టర్లు బిగించుకొని వ్యాపారాలు చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య జఠిలంగా తయారవుతుంది. రోడ్లు మార్జిన్లు సైతం వరుసపెట్టి ఆక్రమణలకు గురౌతున్నా ఇటు ఆర్అండ్బీ అధికారుల, అటు గ్రామ పంచాయతీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సమస్య ముందుకొస్తుంది. ఇటీవల కాలంలో పట్టణంలోని ముఖ్య కూడలి ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ ద్వారా పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. అయినా ఒక్కోమారు ట్రాఫిక్ నిలిచిపోయినా సకాలంలో పోలీసులు స్పందించడం లేదని వాహన చోదకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్అండ్బీ పంచాయతీ, పోలీసు శాఖ సిబ్బంది స్పందించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.