ట్రా‘ఫికర్’
ABN , First Publish Date - 2022-04-24T18:05:05+05:30 IST
నగర రహదారులు వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. గ్రేటర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రధానరహదారులు
ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లపైకి భారీగా వాహనాలు
ఎండలతో మెట్రోలో పెరిగిన రద్దీ
హైదరాబాద్ సిటీ: నగర రహదారులు వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. గ్రేటర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రధానరహదారులు ట్రాఫిక్ మయంగా మారాయి. ఉదయం, సాయంత్రం ఉద్యోగులు రహదారులపై గంటలకొద్దీ ట్రాఫిక్లో చిక్కుకుంటూ చుక్కలు చూస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలయాలు అధికంగా జరుగుతుండటంతో రహదారులపై రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఎండల తీవ్రత కారణంగా మెట్రోలో ప్రయాణికుల రద్దీపెరగడంతో మెట్రోస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.
ఆఫీసు వేళల్లో భారీగా ట్రాఫిక్జాం
గత ఏడాదిన్నరగా లక్షల మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంలో ఉండటం, మరికొంతమంది సొంతూళ్లనుంచి ఉద్యోగాలు చేయడంతో నగర రోడ్లపై వాహనాలు తగ్గాయి. అయితే, ఏప్రిల్ రెండో వారం నుంచి ఉద్యోగులు కార్యాలయాల్లోనే విధులు నిర్వహించాలని పలు సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో కార్యాలయాలకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో ఉదయం 9 నుంచి 11, సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. కొవిడ్ సమయంలో నగరవాసులు పెద్దసంఖ్యలో సొంతవాహనాలు కొనుగోలు చేయడంతో ప్రైవేట్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ట్రాఫిక్ పెరిగేందుకు ఇదికూడా ఒక కారణమని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి : సీపీ
సికింద్రాబాద్ నుంచి బేగంపేట వైపునకు వచ్చే వాహనదారులు మరో 45 రోజులపాటు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సీపీ సీవీ ఆనంద్ కోరారు. రసూల్పురా వద్ద జరుగుతున్న ఎస్ఎన్డీపీ నాలా పనులను సీపీతోపాటు జాయింట్ సీపీ రంగనాథ్తో కలిసి శనివారం పరిశీలించారు.