ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుపతిలో ట్రాఫిక్‌ మళ్లింపులు

ABN , First Publish Date - 2021-03-04T07:44:56+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువారం తిరుపతి పర్యటనకు రానున్నారు.

ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుపతిలో ట్రాఫిక్‌ మళ్లింపులు

తిరుపతి(నేరవిభాగం), మార్చి 3: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువారం తిరుపతి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ నియంత్రణలు ఉంటాయని ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జున వెల్లడించారు. 4వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ నియంత్రణలు ఉంటాయని వివరించారు. కరకంబాడి నుంచి అలిపిరి గరుడ కూడలి వరకు ట్రాఫిక్‌ నియంత్రణ ఉంటుందని, తిరుమల నుంచి వచ్చే వాహనాలు గరుడ సర్కిల్‌ నుంచి రుయా, మెటర్నిటీ టౌన్‌క్లబ్‌ మీదుగా ఆర్టీసీ బస్టాండుకు చేరాల్సి ఉంటుంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి తిరుమలకు వెళ్లాల్సిన వాహనాలు టీఎంఆర్‌ కళ్యాణమండపం, మున్సిపల్‌ కార్యాలయం, వీవీ మహల్‌, అన్నారావు కూడలి, ఇస్కాన్‌ మీదుగా అలిపిరికి చేరాల్సి ఉంటుంది. ఇక కరకంబాడి నుంచి లీలామహల్‌ కూడలివైపుకు రావాల్సిన వాహనాలను రేణిగుంట మీదుగా నగరంలోకి రావాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి పర్యటన నిమిత్తం చేస్తున్న ఈ మార్పులను గమనించి ప్రజలు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-04T07:44:56+05:30 IST