కష్టకాలంలో చేతులెత్తేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ABN , First Publish Date - 2020-08-10T10:20:13+05:30 IST
కరోనా వంటి కష్టకాలంలో కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసి తమ బాధ్యతను విస్మరిం చాయని..
కార్మిక సంఘాల జైల్భరోలో నేతలు 8 మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు
డాబాగార్డెన్స్, ఆగస్టు 9: కరోనా వంటి కష్టకాలంలో కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసి తమ బాధ్యతను విస్మరిం చాయని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు ధ్వజ మెత్తారు. రెక్కాడితేగాని డొక్కాడని కార్మికుల జీవితా లను గాలికి వదిలేశాయన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక, ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘క్విట్ఇండియా’ రోజును పురస్క రించుకుని ‘సేవ్ ఇండియా, సేవ్ వర్కింగ్ క్లాస్, సేవ్ పీపుల్‘ నినాదాలతో జైల్భరో కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు.
తొలుత డాబాగార్డెన్స్లోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించిన అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్.నరసింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు. కరోనాతో కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10వేలు చొప్పున ఇవ్వాలని, ఆరు నెలలపాటు నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కాలంలో ఉద్యోగులకు పూర్తివేతనాలు చెల్లించాలన్నారు. విశాఖ ఉక్కు, జీవిత బీమా వంటి ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటీకరణ యోచనను మోదీ ప్రభుత్వం విడనాడాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, ఎప్ఎఫ్టీయూ నాయకులు గణేష్పాండా, ఏఐసీటీయూ నాయకులు శంకరరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పడాల రమణ, సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్.కె.ఎస్.వి.కుమార్, ఐఎన్టీయూసీ నాయకులు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు,