అరకులోయకు పోటెత్తిన పర్యాటకులు

ABN , First Publish Date - 2022-08-15T06:08:27+05:30 IST

ప్రకృతి అందాల నిలయం అరకులోయకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.

అరకులోయకు పోటెత్తిన పర్యాటకులు
గిరిజన మ్యూజియం గేటు ఎదుట పర్యాటకులు

పద్మాపురం గార్డెన్‌, గిరిజన మ్యూజియం వద్ద సందడి

అరకులోయ, ఆగస్టు 14: ప్రకృతి అందాల నిలయం అరకులోయకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. గాలికొండ వ్యూ పాయింట్‌ వద్ద ఎక్కువగా పర్యాటకులు కనిపించారు. ముసురు వాతావరణం, చల్లటి గాలులు వీస్తుండడంతో అక్కడగా వేడివేడిగా లభించే చీకులు, జొన్నపొత్తులు, బ్యాంబూ చికెన్‌ కోసం ఎగబడ్డారు. అలాగే పద్మాపురం గార్డెన్‌, గిరిజన మ్యూజియం వద్ద పర్యాటకులు ఫొటోలు దిగుతూ, సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. తుఫాన్‌ ప్రభావంతో ముసురు వాతావరణం ఉన్నప్పటికీ తగ్గేదే లే అన్నట్టు ఉత్సాహంగా సందడి చేశారు.


బొర్రాకు సందర్శకుల తాకిడి

అనంతగిరి: ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలుకు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. రెండో వరుసగా శనివారం, ఆదివారం, స్వాత్రంత్య్ర దినోత్సవం సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా కిరండోల్‌ పాసింజరు రైలుకు ఏర్పాటు చేసిన నాలుగు విస్టడ్‌ కోచ్‌లు నిండిపోయాయి రైలు, రోడ్డు మార్గాల్లో గుహలును దాదాపు మూడు వేల మందికిపైగా రాగా, రూ.2.2 లక్షల ఆదాయం వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. అయితే ముసురు వాతావరణం నేపథ్యంలో కటికి, తాడిగుడ జలపాతాల వద్ద సందర్శల తాకిడి కనిపించలేదు. డముకు వ్యూ పాయింట్‌ వద్ద సందర్శకుల వాహనాలతో ట్రాఫిక్‌ రద్దీ కనిపించింది. 

Updated Date - 2022-08-15T06:08:27+05:30 IST