అట్టహాసంగా ‘తూమాటి’ నామినేషన్
ABN , First Publish Date - 2021-11-23T06:43:46+05:30 IST
స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యుడిగా తూమాటి మాధవరావు సోమవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.
ఒంగోలు (కలెక్టరేట్), నవంబరు 22 : స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యుడిగా తూమాటి మాధవరావు సోమవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి వాహనాల్లో ర్యాలీగా బయల్దేరి కలెక్టరేట్కు చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ వెంకటమురళికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండుసెట్ల నామినేషన్లు వేయగా, ఒక్కో దాన్ని పది మంది కార్పొరేటర్లు ప్రతిపాదించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు కరణం బలరాం, అన్నా రాంబాబు, నాగార్జునరెడ్డి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాశి వెంకయ్య, వైసీపీ పర్చూరు ఇన్చార్జి రామనాఽథంబాబు, మేయర్ గంగాడ సుజాత, పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కుప్పం ప్రసాద్, కొమ్మూరు కనకారావు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి బాలినేని మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన మాధవరావును గుర్తించి సీఎం ఎమ్మెల్సీ ఇచ్చారని తెలిపారు.