టోల్గేట్ వద్ద Shashikala ధర్నా Shashikala
ABN , First Publish Date - 2022-07-10T15:58:09+05:30 IST
విల్లుపురం జిల్లా తువాక్కుడి టోల్గేట్ వద్ద తన కారు అద్దాలపై టోల్గేట్ స్కాన్ కట్టె పడటంతో ఆగ్రహించిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు
చెన్నై, జూలై 9 (ఆంధ్రజ్యోతి): విల్లుపురం జిల్లా తువాక్కుడి టోల్గేట్ వద్ద తన కారు అద్దాలపై టోల్గేట్ స్కాన్ కట్టె పడటంతో ఆగ్రహించిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ తన మద్దతుదారులతో కలిసి ధర్నాకు దిగారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. విల్లుపురం నుంచి శశికళ కారులో తంజావూరుకు బయలుదేరారు. ఆమె కారుతో పాటు మరో నాలుగు కార్లు వెంట వెళ్ళాయి. తువాకుడి టోల్గేట్ వద్ద ముందున్న నాలుగు కార్లు చెకింగ్ తర్వాత ముందుకు వెళ్ళాయి. చివరగా వెళుతున్న శశికళ కారు అద్దాలపై టోల్గేట్ స్కాన్ కట్టె పడింది. ఈ సంఘటనతో ఆగ్రహించిన శశికళ కారునుంచి దిగి టోల్గేట్ సిబ్బందితో గొడవపడ్డారు. దీంతో టోల్గేట్ సిబ్బంది భయపడి అక్కడి నుంచి పారిపోయారు. శశికళ మద్దతుదారులతో కలిసి టోల్గేట్ ద్వారాలకు అడ్డంగా కార్లను ఉంచి ధర్నాకు దిగటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఆమెకు సర్దిచెప్పారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి తంజావూరుకు బయలుదేరారు.