లగ్జరీ టాయిలెట్లు.. సిరిసిల్ల బల్దియా పరిధిలో ఐదు
ABN , First Publish Date - 2020-08-13T20:50:31+05:30 IST
సంపూర్ణ స్వచ్ఛతకు ప్రభుత్వ కృషి చేస్తోంది. అదే లక్ష్యంతో ప్రధాన నగరాల్లో విలాసవంతమైన సౌకర్యాలతో వాష్రూమ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
విలాస వంతమైన సౌకర్యాలతో నాలుగు పూర్తి
15న మంత్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): సంపూర్ణ స్వచ్ఛతకు ప్రభుత్వ కృషి చేస్తోంది. అదే లక్ష్యంతో ప్రధాన నగరాల్లో విలాసవంతమైన సౌకర్యాలతో వాష్రూమ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పెద్ద పెద్ద నగరాలకు వెళ్లిన సందర్భంలో కనిపించే లగ్జరీ టాయిలెట్లను అన్ని మున్సిపాలిటీల్లో అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ తరహాలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఏక్సోరా ఎఫ్ఎం ప్రైవేటు సంస్థ, ప్రభుత్వ భాగస్వామంతో లూ కేఫే మోడరన్ టాయిలెట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐదు లగ్జరీ టాయిలెట్లలో నాలుగు పూర్తి చేశారు. ఇందులో మహిళల కోసం మూడు, పురుషుల కోసం రెండు, మూడు యూరినల్స్ ఉన్నాయి. చేతులు శుభ్రం చేసుకోవడానికి కూడా సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం కొవిడ్ నియంత్రణ చర్యలు పాటిస్తున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన నివారించడంతోపాటు కొవిడ్ 19 ముప్పును తగ్గించడానికి మోడరన్ మరుగుదొడ్లు ఉపయోగపడుతాయని భావిస్తున్నారు. పురపాలక సంఘం నిర్వహణలోనే ఉచితంగా సేవలను అందించనున్నారు.
15న ప్రారంభోత్సవం
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన మోడరన్ టాయిలెట్లను ఆగస్టు 15న పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిసిల్లలో నాలుగు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. చంద్రంపేట చౌరస్తా వద్ద మరొకటి ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్లను ప్రాథమిక హక్కుగా గుర్తించి పట్టణ ప్రాంతాల్లో ప్రతీ వెయ్యి మందికి కనీసం ఒక టాయిలెట్ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మోడరన్ టాయిలెట్లను నిర్మించారు.