నేడు Karuna జయంతి
ABN , First Publish Date - 2022-06-03T13:01:35+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం.కరుణానిధి 98వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే శ్రేణులు సంబరాలు జరుపుకోనున్నాయి.
ప్యారీస్(చెన్నై): మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం.కరుణానిధి 98వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే శ్రేణులు సంబరాలు జరుపుకోనున్నాయి. అన్నాసాలై ఓమందూరార్ ఎస్టేట్ ప్రాంగణంలో ఇటీవల ఏర్పాటుచేసిన కరుణానిధి విగ్రహానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. రాష్ట్ర మంత్రులు, డీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కరోనా నిబంధనలు పాటిస్తూ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కరుణ జయంతి వేడుకలను స్టాలిన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే విధంగా ‘నగరాల్లో పరిశుభ్రత ప్రజా వ్యవస్థ’ పేరుతో పారిశుధ్య పనులు, అవగాహనా శిబిరాలను మింట్లో సీఎం ప్రారంభించనున్నారు. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే శ్రేణులు కరుణ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇదిలా వుండగా కరుణ జయంతిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం చెన్నై కార్పొరేషన్ ప్రధాన కార్యాలయమైన ‘రిప్పన్ భవన్’కు రూ.1.81 కోట్ల తో విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.