నాడు చలకుర్తి, నేడు నాగార్జునసాగర్‌ నియోజకవర్గం

ABN , First Publish Date - 2021-03-19T06:22:24+05:30 IST

పూర్వ చలకుర్తి, ప్రస్తుత నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12సార్లు ఎన్నికలు జరిగాయి.

నాడు చలకుర్తి, నేడు నాగార్జునసాగర్‌ నియోజకవర్గం

నిమ్మల హాట్రిక్‌.. జానా డబుల్‌ హాట్రిక్‌

రాంమూర్తి, నోముల ఒక్కోసారి ప్రాతినిధ్యం

నిడమనూరు, మార్చి 18: పూర్వ చలకుర్తి, ప్రస్తుత నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12సార్లు ఎన్నికలు జరిగాయి. జానారెడ్డి రాజకీయ గురువు నిమ్మల రాములు మూడు సార్లు, జానారెడ్డి ఏడు సార్లు, రాంమూర్తి, నోముల ఒక్కోసారి ప్రతినిధ్యం వహించారు. 1967లో చలకుర్తి నియోజకవర్గంగా ఏర్పాటు కాగా 2004 వరకు అదే పేరుతో కొనసాగింది. నియోజకవర్గాల పునర్విభజనలో 2009 నుంచి చలకుర్తిని నాగార్జునసాగర్‌ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. చలకుర్తి నుంచి పెద్దవూర మండలానికి చెందిన బీసీ నాయకుడు నిమ్మల రాములుగౌడ్‌ 1967, 72, 78లో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలిచి హాట్రిక్‌ సాధించారు. ఆయన శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన అనుముల మండలానికి చెందిన కుందూరు జానారెడ్డి 1983, 85, 89, 99, 2004, 2009, 2014లో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983, 85లో జానారెడ్డి టీడీపీ నుంచి గెలవగా, మిగతా ఐదుసార్లు కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. గురువు నిమ్మల రాములు హాట్రిక్‌ సాధిస్తే శిష్యుడు జానారెడ్డి డబుల్‌ హాట్రిక్‌ సాధించారు. 1994లో త్రిపురారం మండలానికి చెందిన గుండెబోయిన రాంమూర్తియాదవ్‌ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పెద్దదేవులపల్లి సర్పంచ్‌గా ఉన్న ఆయన సీనియర్‌ మంత్రి అయిన కుందూరు జానారెడ్డిని అనూహ్యంగా ఓడించి అప్పట్లో రికార్డు సృష్టించారు. తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో రాంమూర్తియాదవ్‌ అంతగా ప్రభావం చూపలేకపోయారు. 2018లో నోముల నర్సింహయ్య టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్థానికేతరుడు అయిన నర్సింహయ్య తొలత 2014లో జానారెడ్డి చేతిలో ఓటమి చెందినా స్థానికంగా నివాసం ఉం టూ 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించారు. 

Updated Date - 2021-03-19T06:22:24+05:30 IST