Mobile phones: సెంట్రల్‌ జైల్లో ఆకస్మిక తనిఖీలు

ABN , First Publish Date - 2022-08-20T13:36:26+05:30 IST

తిరుచ్చి సెంట్రల్‌ జైల్లో(Tiruchi Central Jail) శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులకు దిగ్ర్భాంతి గొలిపే విషయాలు

Mobile phones: సెంట్రల్‌ జైల్లో ఆకస్మిక తనిఖీలు

                                       - 60 మొబైల్ ఫోన్ల స్వాధీనం


చెన్నై, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తిరుచ్చి సెంట్రల్‌ జైల్లో(Tiruchi Central Jail) శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులకు దిగ్ర్భాంతి గొలిపే విషయాలు ఎదురయ్యాయి. విదేశీయులు, శ్రీలంక శరణార్థులు వున్న ప్రత్యేక జైలు విభాగంలో ఏకంగా 60 మొబైల్‌ ఫోన్లు బయల్పడడంతో బిత్తరపోవడం అధికారుల వంతైంది. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు ఉన్నతస్థాయి విచారణ చేపట్టారు. తిరుచ్చి సెంట్రల్‌ జైల్లో 2500 మందికిపైగా విచారణ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఉన్నారు. అదే జైల్లో నకిలీ పాస్‌పోర్ట్‌(Fake passport)లతో అరెస్టయిన విదేశీయులు, నేరాలకు పాల్పడిన రాష్ట్రేతరులు, శ్రీలంక శరణార్థులను ప్రత్యేక విభాగంలో వుంచారు. ఈ విభాగంలో ప్రస్తుతం 156 మంది ఖైదీలు ఉన్నారు. ఆ శిబిరంలోని ఖైదీలు తరచూ సెల్‌ఫోన్లలో బంధువులతో రహస్యంగా మాట్లాడుతున్నట్లు సమాచారం అందటంతో తిరుచ్చి నగర పోలీసు కమిషనర్‌ అన్బు నేతృత్వంలో పోలీసు అధికారులు శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మూడు గంటలపాటు కొనసాగిన ఈ సోదాల్లో 60 సెల్‌ఫోన్లు(Cell phones) లభించాయి. ఈ సెల్‌ఫోన్లను ఖైదీలు తమ గదులకు సమీపంలోని గుంతల్లో దాచి ఉంచినట్లు పోలీసు అధికారులు కనుగొన్నారు. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-08-20T13:36:26+05:30 IST