గన్నవరం విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం
ABN , First Publish Date - 2022-07-04T06:21:11+05:30 IST
గన్నవరం విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం
నేడు ప్రధాని నరేంద్రమోదీ రాక
ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో భీమవరానికి..
మధ్యాహ్నమే తిరుగు ప్రయాణం
1,100 మందితో పోలీస్ బందోబస్తు
ఏర్పాట్లు పరిశీలించిన కృష్ణాజిల్లా కలెక్టర్
గన్నవరం, జూలై 3 : ప్రధాని నరేంద్రమోదీ రాక సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టులో భద్రత కట్టుదిట్టం చేశారు. సుమారు 1,100 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ వావిరాల మహేశ్కుమార్ ఆదివారం గన్నవరం ఎయిర్పోర్టులో ఏర్పాట్లను పరిశీలించారు. సెక్యూరిటీ చెక్ పాయింట్, వీఐపీ లాంజ్, ఎమ్మిగ్రేషన్ విభాగాలను తనిఖీ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం 10.10 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారని చెప్పారు. ప్రధానికి రాష్ట్ర గవర్నర్, సీఎం స్వాగతం పలుకుతారని చెప్పారు. 10.15 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధానితో పాటు గవర్నర్, సీఎం భీమవరం వెళ్తారన్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు భీమవరం నుంచి తిరిగి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారని, అనంతరం ప్రత్యేక విమానంలో బయల్దేరి అహ్మదాబాద్ వెళ్తారని చెప్పారు. ప్రధాని పర్యటన విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ కొవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఎయిర్పోర్టు అంతా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్టు డైరెక్టర్ రామారావు, గుడివాడ ఆర్డీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు.