తుపాకీతో బెదిరించి ఆభరణాల చోరీ
ABN , First Publish Date - 2020-10-20T07:27:40+05:30 IST
తుపాకీతో బెదిరించి ఓ వృద్ధురాలి నుంచి బంగారు ఆభరణాలు దొంగిలించారన్న సమాచారం గుడివాడలో అలజడి సృష్టించింది. బాధితురాలి కఽథనం మేరకు..
ఇల్లు కొంటానని వచ్చి వృద్ధురాలిపై దౌర్జన్యం
గుడివాడ, అక్టోబరు 19: తుపాకీతో బెదిరించి ఓ వృద్ధురాలి నుంచి బంగారు ఆభరణాలు దొంగిలించారన్న సమాచారం గుడివాడలో అలజడి సృష్టించింది. బాధితురాలి కఽథనం మేరకు.. స్థానిక కాకతీయ నగర్లో అమ్మకానికి పెట్టిన ఓ ఇంటికి రియల్ బయ్యర్ పేరిట ఓ అగంతకుడు వచ్చాడు. ఇల్లు కొనుగోలు చేస్తానంటూ లోపలికి వచ్చి ఇల్లంతా పరిశీలించాడు. ఓ సింక్ ట్యాప్లో నుంచి నీళ్లు రావడం లేదని చెప్పడంతో.. వృద్ధురాలు ముందుకు వెళ్లి పరిశీలిస్తుండగా తలకు తుపాకీ గురిపెట్టి.. ఒంటి మీద బంగారం ఇచ్చేయమంటూ బెదిరించాడు.
ఈ పరిణామంతో బెంబేలెత్తిపోయిన ఆమె.. తన చేతికున్న ఎనిమిది గాజులు, మెడలో బంగారు గొలుసు తీసి ఇచ్చేసింది. వెంటనే ఆమెను ఇంట్లో ఉంచి తలుపు గడియ వేసి అగంతుకుడు పరారయ్యాడు. అంతకుముందు వృద్ధురాలి కుమార్తె బయటికి వెళ్తూ.. ఇల్లు చూడటానికి ఒక వ్యక్తి వస్తాడని చెప్పడంతో బైక్ మీద వచ్చిన యువకుడు అతడే అయి ఉంటాడని వృద్ధురాలు లోనికి తీసుకెళ్లింది. తుపాకీ తెల్లగా ఉందని వృద్ధురాలు చెబుతుండటంతో నకిలీ తుపాకీ అయి ఉంటుందని వన్టౌన్ ఎస్ఐ పి.ఎస్.వి.సుబ్రహ్మణ్యం తెలిపారు.